ఇంటర్ ఉచ్చు : ప్రభుత్వంపై నజర్.. టార్గెట్ జగదీశ్ రెడ్డి.. బర్తరఫ్ కోసం విపక్షాల పట్టు
హైదరాబాద్ : కారు జోరుకు అడ్డులేకుండా పోతున్న తరుణంలో స్పీడ్ బ్రేకులు కలవరం రేపుతున్నాయి. పక్కా రోడ్డు వేసి కారు స్పీడు పెంచుతున్న తరుణంలో ఇంటర్మీడియట్ ఫలితాలు టీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. అసెంబ్లీలో ప్రతిపక్షమన్న మాటే లేకుండా చేద్దామనుకున్న గులాబీ నేతల ప్లాన్ ఇంటర్ రూపంలో బెడిసికొడుతోంది.
టీఆర్ఎస్ గాలివాటానికి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీవనానికి చేరుకుంటున్నారు. అయితే గులాబీదళం దూకుడుకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్న కాంగ్రెస్ పెద్దలకు మంచి అస్త్రం దొరికినట్లైంది. ఇంటర్మీడియట్ ఫలితాల తప్పులతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఓసీల ఓట్లు ఓసీలకే.. బీసీల ఓట్లు బీసీలకే.. టీఆర్ఎస్లో గిట్ల కూడా ఉంటదా?
టీఆర్ఎస్ కు ఎదురుగాలి
తెలంగాణలో టీఆర్ఎస్ హవా వేరే చెప్పనక్కర్లేదు. ఉద్యమ బాట నుంచి రాజకీయ శక్తిగా అవతరించి బాగా బలపడింది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రధానంగా కాంగ్రెస్ గూటి ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. 19 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులు ఇప్పటికే సగం వరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
టీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదంటూ మండిపడుతున్నాయి. అయినా కూడా టీఆర్ఎస్ జోరు తగ్గడం లేదు. ఆ క్రమంలో టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న విపక్ష నేతలకు మంచి అస్త్రం దొరికినట్లైంది. ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాన్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు సమాయత్తమయ్యాయి.
ఇదే సరైన సమయం..! విపక్షాల పాత్ర
ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. బోర్డుకు మాయాని మచ్చను మిగిల్చాయి. అటు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పదవికి ఎసరు తెచ్చేలా మారాయి. టీఆర్ఎస్ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న విపక్ష నేతలు అందివచ్చిన ఈ ఛాన్స్ ను ఏమాత్రం చేజారనీయకుండా స్కెచ్ వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఆందోళన పర్వం వేడెక్కిస్తున్నారు. రాజధానితో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీశ్రేణులకు పిలుపునిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఊపిరి సలపనివ్వకుండా బాణం ఎక్కుపెట్టిన విపక్ష నేతలు.. అందుకనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అటు మంత్రి జగదీశ్ రెడ్డి టార్గెట్ గా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా మీ బాధ్యత ఏదంటూ నిలదీస్తున్నారు.
మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే..!
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లిన కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు విపక్ష నేతలు. ఆ క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ జగదీశ్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ అమాత్య పదవి నుంచి దించేస్తే.. ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లుగా ప్రచారం చేయాలనే ఆలోచన కావొచ్చు. అందుకే ఈ అంశాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఆ మేరకు మహాకూటమి నేతలంతా కలిసికట్టుగా గవర్నర్ నరసింహన్ ను కలిసి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.
ఇంటర్ ఫలితాల గందరగోళంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరారు. గ్లోబరినా సంస్థతో పాటు ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించేలా చూడాలని విన్నవించారు.
పక్కింట్లోనే 5 రోజులు నరకం చూసిన బిడ్డ ! ఆచూకీ కోసం తల్లడిల్లిన పేరెంట్స్ ! చివరికి ఏమైంది ?
బీజేపీ కూడా అదే పాట.. జగదీశ్ రెడ్డిని దించాల్సిందే..!
ఇంటర్ ఫలితాల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు కూడా గవర్నర్ ను కలిశారు. బోర్డు వైఫల్యాలపై, ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆ పదవిలో నుంచి సీఎం కేసీఆర్ ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేసేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి పాలన కేవలం ఫామ్హౌస్కే పరిమితమైందని ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా మంత్రిపై గానీ, బోర్డు కార్యదర్శిపై గానీ చర్యలు తీసుకోకుండా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్కు.. ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. అవినీతి అక్రమాలతో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు.