కేసీఆర్ పై డోస్ పెంచిన విపక్షాలు..!ప్యాకేజీపై బీజేపి, ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎదురుదాడి.!
హైదరాబాద్ : తెలంగాణలో నిన్నటి వరకు కరోనా వైరస్ ప్రభావం గురించి చర్చ జరిగింది. ఆ చర్చ నెమ్మదిగా రాజకీయం వైపు మళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్రం ప్రకటించిన బాహుబలి ప్యాకేజీ గురించి ప్రస్ధావించిన తీరును బీజేపి ఎండగడుతోంది. అంతే కాకుండా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సంబంధించి అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. కేంద్ర నిధులు నేరుగా బాదితులకు చేరితే తప్పేంటని బీజేపి ప్రశ్నిస్తుండగా, ప్రాజెక్టుల వల్ల తెలంగాణ సస్యశ్యామలం చేస్తారని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కానీ, ఇలాంటి స్వార్థ రాజకీయాలకోసం కాదని కాంగ్రెస్ పార్టీ గులాబీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్టు తెలుస్తోంది.
జగన్, కేసీఆర్ దోస్తాన తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు..!మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీలు..!!
తెలంగాణ సర్కార్ పై ముప్పేట దాడి.. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న కాంగ్రెస్, బీజేపి..
కరోనా ప్రభావం నుండి ప్రజలు బయటపడకపోయినా రాజకీయ నేతలు మాత్రం బయటపడ్డట్టు తెలుస్తోంది. అందుకే కరోనా గురించి కాకుండా రాజకీయాల గురించి వాడివేడి చర్చకు తెరతీసారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడంతో పాటు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. లక్షలాది కుటుంబాలు జీవనోపాది లేక రోడ్డునపడ్డ సందర్బాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి తరుణంలో దేశంలోని దెబ్బతిన్న రంగాలను పునర్మించేందుకు దేశ ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వ్యవస్ధల బలోపేతం కోసం, సామాన్య ప్రజల సంక్షేమం కోసం 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రతిష్టాత్మక ప్యాకేజీని పనికిమాలిందంటారా.. విరుచుకుపడ్డ ఏపి, తెలంగాణ బీజేపి నేతలు..
ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ప్యాకేజీ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. 20లక్షల కోట్ల ప్యాకేజీని ఎందుకూ పనికిరాని ప్యాకేజీగా చంద్రశేఖర్ రావు కొట్టిపారేసారు. దీంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. పన్నుల వాటాకు సంబంధించి కేంద్రం ఇచ్చేదేమిటని చంద్రశేఖర్ రావు ప్రశ్నిస్తున్నారని, ఇదే మాట కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అనలేదని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులను మోడీ సర్కారు 32 శాతం నుంచి 41 శాతానికి పెంచారని, ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంపుపై విమర్శలు చేయడం చంద్రశేఖర్ రావు విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు.
ప్రాజెక్టుల అంశంలో ఉదాసీనత ఎందుకు.. కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్న టీ కాంగ్రెస్ నేతలు..
ఇక పోతిరెడ్డి పాడు వ్యవహారంలో సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహారాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎండగడుతోంది. పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రాజెక్టుల తీరుపై చంద్రశేఖర్ రావు తీరును కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వాదులంతా కలిసి అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చామని గుర్తు చేసారు. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత సీఎం చంద్రశేఖర్ రావు పైన ఉందని తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంల స్నేహం తెలంగాణ వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.
తెలంగాణ అవతరణ రోజే కాంగ్రెస్ దీక్ష.. టీఆర్ఎస్ కౌంటర్ పై ఉత్కంఠ..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యాఖ్యల పట్ల అటు ఏపి బీజేపిలో కూడా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. దేశప్రజల సంక్షేమం కోసం ప్రకటించిన అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఏపీ బీజేపి అద్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వంపై కావాలనే బురదజల్లుతున్నారని, కాని ప్రజలకు అన్ని అంశాల పట్ల అవగాహన ఉందని చురకలంటించే ప్రయత్నం చేసారు. తెలంగాణ బీజేపి ప్రత్యేక అధికార ప్రతినిధి క్రిష్ణసాగర్ రావు కూడా తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా వేడుక్కాయనే చర్చ జరుగుతోంది.