పాక్ చెరలో ఉన్న హైదరాబాదీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సమాచారంపై ఏపీ, తెలంగాణల్లో ఆరా: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో బందీగా ఉన్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ను విడుదల చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మురం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రశాంత్ ను స్వదేశానికి రప్పించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, పాకిస్తాన్ విదేశాంగం, హోం మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదిస్తున్నామని అన్నారు.
అమ్మాయి కోసం హద్దులు దాటి..
హైదరాబాద్ మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తన్న ప్రశాంత్ ప్రస్తుతం పాకిస్తాన్ బలగాల చేతిలో బందీగా ఉన్న విషయం తెలిసిందే. బహావల్ పూర్ వద్ద అనుమాస్పదంగా తిరుగాడుతున్న ప్రశాంత్ ను పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రశాంత్ వద్ద పాస్పోర్టు, వీసా లేవు. ఆన్ లైన్లో పరిచయం ఏర్పడిన ఓ అమ్మాయిని వెదుక్కుంటూ గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడు.
కేంద్రం దృష్టికి ఇప్పుడే..
ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ సురక్షితంగా ఉన్నాడని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రశాంత్ ను విడిపించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించారు. ప్రశాంత్ పాకిస్తాన్ బలగాల చేతుల్లో బందీగా ఉన్నాడనే విషయం ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడారని, ప్రశాంత్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తెప్పించుకుందని అన్నారు.
రెండు దేశాల రాయబార కార్యాలయాల్లో..
ఈ నివేదికను భారత్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి అధికారికంగా అందజేశామని, ప్రశాంత్ నేపథ్యాన్ని కూలంకషంగా వారికి వివరించామని అన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన నేపథ్యం ప్రశాంత్ కు గానీ, ఆయన కుటుంబానికి గానీ లేదని చెప్పారు. ఈ కారణాన్ని చూపించి, మానవతాదృక్పథం కింద ప్రశాంత్ ను విడిపించాలని కోరుతున్నామని అన్నారు. ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయాన్ని తాము అప్రమత్తం చేశామని చెప్పారు.