వీళ్లేం దొంగల్రా నాయనా .. కారులో వచ్చి పాన్ డబ్బా దోచారు (వీడియో)
హైదరాబాద్ : నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. స్టైల్ మార్చుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. కాదేది దొంగతనాలకు అనర్హం అనుకుంటున్నారో ఏమో గానీ ఎక్కడ పడితే అక్కడ చోరీలకు పాల్పడుతున్నారు. ఇదివరకు ఇళ్లకే పరిమితమైన చోరాగ్రేసరులు రానురాను పంథా మార్చుతున్నారు. ఇళ్లల్లో చోరీలు చేయడం గగనమైపోయిందో ఏమో గానీ ఇటీవల ఏటీఎంలు, దుకాణాలపై కన్నేశారు.
తాజాగా హైదరాబాద్ మహానగరంలో జరిగిన చోరీ తీరు విస్మయం కలిగిస్తోంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయారు. స్టైల్గా కారులో వచ్చి పాన్ డబ్బాలో దొంగతనానికి పాల్పడ్డారు.
నాగోల్ ఏరియాలో సామ్రాట్ పాన్ షాప్లో జరిగిన చోరీ చర్చానీయాంశమైంది. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి దర్జాగా దొంగతనానికి పాల్పడ్డారు. అయితే అందులో ఓ వ్యక్తి అటువైపు ఎవరైనా వస్తున్నారా అనే విషయాలు కనిపెడుతుంటే.. మరో వ్యక్తి పాన్ డబ్బాలోకి దూరి అందినకాడికి పట్టుకెళ్లాడు. క్యాష్ కౌంటర్లోని డబ్బులను ప్యాంట్ జేబుల్లో కుక్కి.. సిగరెట్ పెట్టెలను ఓ పెద్ద కవర్లో వేసుకుని బయటపడ్డాడు.
నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డి
పాన్ డబ్బాలో చోరీ జరగడంతో సదరు ఓనర్ పోలీసులను ఆశ్రయిస్తే పెద్దగా పట్టించుకోలేదట. పాన్ డబ్బా అని తేలికగా తీసుకున్నారో ఏమో గానీ.. చోరీ జరిగి రెండు రోజులవుతున్నా.. ఇంతవరకు అటువైపు ఏ ఒక్క పోలీస్ కూడా కన్నెత్తి చూడలేదట. దాదాపు 2 లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు లైట్గా తీసుకున్నారనేది బాధితుడి ఆరోపణ. రుజువులతో సహా సీసీ ఫుటేజ్ అందించినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదంటున్నారు ఆ పాన్ డబ్బా యజమాని శ్రీకాంత్.