స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇప్పుడు స్వీయ బహిష్కరణ చేసుకున్నారట.. కేసీఆర్ గొప్ప టంగ్ ట్విస్టర్..
హైదరాబాద్: లాభాల్లో నడిపించాల్సిన ఆర్టీసిని నష్టాల పాలు చేస్తూ ప్రభుత్వానికి భారంగా మారిన పరిస్థితులను సమూలంగా మార్చి వేస్తాం. అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడం. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్ లో ఇక ఆర్టీసీలో యూనియనిజం వుండదు. ఉద్యోగులు ఎప్పుడో స్వీయ బహిష్కరణ చేసుకున్నారు. స్వయంగా ఉద్యోగాల నుండి బహిష్కరణ ప్రకటించుకున్నారు కాబట్టి వారిని ఉద్యోగులుగా గుర్తించేది లేదు. వారి స్ధానంలో కొత్త నియామకాలు చేపడతాం. ఇది ఆర్టీసి ఉద్యోగుల పట్ల, ఉద్యోగ సంఘాల పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మనోగతం. తెలంగాణ ఆవిర్బాంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసి ఉద్యోగులతో చంద్రశేఖర్ రావు వైరాన్ని కొనితెచ్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు .. ఉద్యోగుల తొలగింపు కరెక్ట్ కాదన్న పవన్
తెలంగాణలో తమిళ రాజకీయం.. ఆర్టీసి ఉద్యోగుల పట్ల కేసీఆర్ కఠిన నిర్ణయాలు..
సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులతో కఠినంగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రావు, ఉద్యోగ సంఘాల నుండి ప్రతిఘటన ఎదుర్కొనబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఆర్టీసి ఉద్యోగ సంఘాలు ఇలాగు అప్రకటిత సమ్మెకు దిగితే ఏకాఎకిన 900మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా అప్పటి సీఎం జయలలిత తొలగించారు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టలేదు. అంతే కాకుండా ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంత తేలిగ్గా ప్రభుత్వంపై నిరసన తెలిపిన దాఖలాలు లేవు.
సకల జనుల సమ్మెలో ఆర్టీసి ఉద్యోగుల కీలక పాత్ర.. ఆర్టీసి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సీరియస్..
ఇప్పుడు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఉద్యోగుల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించినట్టుగానే తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహరించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడుకు, తెలంగాణ రాష్టానికి చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంలో ఉద్యోగుల పాత్ర, ముఖ్యంగా ఆర్టీసి ఉద్యోగుల భాగస్వామ్యం కీలకంగా ఉందని అనేక సందర్బాల్లో సీఎం చంద్రశేఖర్ రావు స్వయంగా ఒప్పుకున్నారు.
ఉద్యమ సమయంలో ఒక మాట.. ఇప్పుడొక మాట.. కేసీఆర్ గొప్ప టంగ్ ట్విస్టర్..
ఆర్టీసి ఉద్యోగుల కాలిలో ముళ్లు గుచ్చుకుంటే తమ పంటితో తీస్తామనే ఘాటు సెంటిమెంట్ వ్యాఖ్యలు చేసిన సందర్బాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కాని పరిస్థితులు అందుకు పూర్తి బిన్నంగా మారిపోయాయి. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగణ రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్మవహరించే బదులు కఠినంగా వ్యవహిరించడమే కాకుండా ఉద్యోగాల నుండి ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇదే అంశం పట్ల ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
మరో ఉద్యమం దిశగా ఉద్యోగుల.. ఆర్టీసి ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలు..
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ, సీఎం చంద్రశేఖర్ రావు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని, తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామనీ ఆయన అన్నారు. క్రమశిక్షణను తుచ తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నమని చెప్పారు. దీంతో తెలంగాణలో ఉద్వాసనకు గురైన ఆర్టీసి కార్మికులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.