కరోనా బారినపడ్డ మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ ఇంట్లో 8 మందికి పాజిటివ్...
పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి,సోదరుడు,పీఏ,గన్మెన్లకు వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం మహిపాల్ రెడ్డి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శనివారం రాత్రి నుంచి ఆయన దగ్గు,జ్వరంతో బాధపడుతుండటంతో ఆదివారం(అగస్టు 2) కరోనా టెస్టులు చేయించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి,సోదరుడు,డ్రైవర్లు,గన్మెన్,వంట మనిషి.. మొత్తంగా 8 మందికి పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శనివారం(అగస్టు 1) హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ జనరల్ సెక్రటరీల సమావేశంలో నారదాసు పాల్గొన్నారు. అలాగే ఇటీవల కరీంనగర్లోనూ పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకగా... హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సతో ఆయన కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్,గణేశ్ గుప్తాలు కూడా కరోనా బారినపడ్డప్పటికీ.. కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ 71 ఏళ్ల వయసులోనూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా మరో 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 48,609కి చేరగా... మొత్తం 551 మంది కరోనాతో మృతి చెందారు.