రిపోర్టర్కు బెదిరింపు: కాళ్లు, చేయి నరుకుతా అంటూ రెచ్చిపోయిన ఎమ్మెల్యే
అన్యాయం, అక్రమాన్ని ప్రశ్నించారో అంతే సంగతులు. నేతలు రెచ్చిపోతున్నారు. బూతు పురాణం వినిపిస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేదు. రిపోర్టర్లపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొకొల్లలు కాగా.. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే బెదిరింపు బాగోతం బయటకు వచ్చింది. ఓ రిపోర్టర్ను ఫోన్లోనే తలంటారు.
పటాన్ చెరు ఓ పత్రికలో సంతోష్ నాయక్ పనిచేస్తున్నాడు. భూ కబ్జా గురించి వరసగా కథనాలు రాశాడు. అందులో ఎమ్మెల్యే పేరు కూడా ఉంది. ఇంకేముంది మహిపాల్ రెడ్డికి ఎక్కడలేని కోపం వచ్చింది. సదరు రిపోర్టర్కు ఫోన్ చేసి.. చడా మెడ వాయించారు. తన వద్దకు రావాలని ఫోన్లోనే ఆదేశించాడు. కాదంటే ఎలా రప్పించాలో తనకు తెలుసు అని చెప్పారు. కాళ్లు, చేతులు నరుకుతా బిడ్డ అంటూ రెచ్చిపోయారు. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పు అని కూడా విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే-రిపోర్టర్ మాట్లాడిన ఆడియో వైరలైంది. అందులో ఎమ్మెల్యే రెచ్చిపోతున్న ఆడియో వినిపిస్తోంది. జర్నలిస్ట్ సంతోష్తో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టు సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించాయి. దీనిపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పందించాల్సి ఉంది.
మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరో నేత రెచ్చిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు. లేదంటే తాము అందరికీ చులకన అవుతామని అంటున్నారు.