ఎమ్మెల్యే మహిపాల్పై కేసు, వెనక్కి తగ్గిన నేత, కామెంట్స్ విత్ డ్రా అంటూ ప్రకటన
విలేఖరి సంతోష్ నాయక్పై ప్రతాపం చూపించిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తనకు జర్నలిస్టులంటే గౌరవం ఉందని స్పష్టంచేశారు. అయితే కబ్జాలతో తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తన పేరు రాయడంతో మాట్లడానని.. వివరణ తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పారు.
తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాశారని, ఆరోపణలకు సంబంధించిన వార్తలు రాసే ముందు వివరణ తీసుకోవడం జర్నలిస్టుల ధర్మమని తెలిపారు. వివరణ కూడా తీసుకోకుండా వార్తలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్ట్ సంతోష్పై పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. భూ కబ్జాలపై వార్త రాసినందుకు ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. ఫోన్లోనే బూతుపురాణం వినిపించారు.
కాళ్లు, చేతులు నరుకుతా.. చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బూతులు తిట్టారు. ఆ ఆడియో వైరల్ అయ్యింది. సంతోష్ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో ఎమ్మెల్యే తాజా ప్రకటన విడుదల చేశారు. కబ్జాలపై వార్త రాసినందుకు ఎమ్మెల్యే దూషించిన ఘటన కలకలం రేపింది. నిన్న అమీన్ పూర్ పోలీస్టేషన్లో టీయూడబ్ల్యూజే, ఐజేయు సంఘం ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.