నిమ్స్ వైద్యుడిపై పేషెంట్ బంధువుల దాడి.. సిబ్బంది ధర్నా.. ఐదుగురిపై కేసు
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్యూటీ డాక్టర్పై పేషెంట్ బంధువులు దాడికి దిగడం వివాదస్పదమైంది. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ చేయి చేసుకున్నారు. దాంతో ఆసుపత్రి ప్రాంగణం రచ్చరచ్చగా మారింది. పోలీసుల సమక్షంలోనే వైద్య సిబ్బందిని దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. అయితే పేషెంట్ బంధువులు విధి నిర్వహణలో ఉన్న డాక్టర్పై చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ.. అక్కడి సిబ్బంది ధర్నాకు దిగారు.
నిఖిల్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అతడి బంధువులు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సోమవారం నాడు తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో హాస్పిటల్కు తీసుకొస్తే.. దాదాపు రెండు మూడు గంటల వరకు తమను ఎవరూ పట్టించుకోలేదనేది వారి ఆరోపణ. గాయపడ్డ వ్యక్తి తల నుంచి తీవ్ర రక్తస్రావం జరుగుతుంటే ఎమర్జెన్సీ వార్డులో పట్టించుకునే నాథుడే లేకపోయాడని వారి ఆవేదన. దాంతో అక్కడి సిబ్బందికి, పేషెంట్ బంధువులకు మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.
బాంబుల్లా పేలిన బీరు సీసాలు.. లారీ లోడ్ అగ్నికి ఆహుతి..!
సీరియస్ కండిషన్లో ఉన్న బాధితుడిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదనే కోపంతో డ్యూటీ డాక్టర్పై చేయి చేసుకున్నారు. తాము ఎవరి మనుషులమో తెలుసా అంటూ నానా యాగీ చేసినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో హంగామా చేసిన వారిలో నగరానికి చెందిన ఓ మంత్రి అనుచరులు ఉన్నట్లు సమాచారం.
అదలావుంటే విధి నిర్వహణలో ఉన్న డాక్టర్పై చేయి చేసుకున్నవారి పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నిమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లు ధర్నాకు దిగారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. మరోవైపు సదరు బాధిత డాక్టర్ ఫిర్యాదు మేరకు ఐదుగురు వ్యక్తులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.