జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని జనసేన నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలలో పోటీ ఫై కీలక ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై జనసేన నజర్ ... పొత్తులతోనైనా.. సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ !!
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని బరిలోకి దిగుతున్న జనసేన
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి. గ్రేటర్ పై గులాబీ జెండా రెపరెపలాడాలి అని టిఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంటే ,టిఆర్ఎస్ పార్టీ ని గట్టిగా దెబ్బకొట్టాలని బీజేపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతున్నాయి .ఇక గ్రేటర్ హైదరాబాద్ లో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టిడిపి తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చెయ్యాలని భావిస్తుంటే, ఈసారి జనసేన కూడా గ్రేటర్ లో తన సత్తా చూపించాలని తాపత్రయపడుతోంది.
పోటీ చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ
అందులో భాగంగా గ్రేటర్ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ శ్రేణులకు పోటీ చేస్తున్నామంటూ పిలుపునిచ్చారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా పనిచేస్తున్న యువ కార్యకర్తలు విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలు, యువత, జనసైనికుల నుంచి ఎన్నికలలో పోటీ పై పలు విజ్ఞప్తులు వచ్చాయని, వారి వినతి మేరకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు, నగర పరిధిలోని కమిటీలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
Recommended Video
క్రియాశీలక కార్యకర్తల అభీష్టం మేరకే పోటీలో ... పార్టీ శ్రేణులకు పిలుపు
ఈ విషయంపై పలు దఫాలుగా చర్చించిన జనసేన నేతలు, జీహెచ్ఎంసీలో క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారని తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నారని జనసేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారి అభీష్టం మేరకే జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఏపీ తరహాలో పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అన్న విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఎన్నికల బరిలో జనసేన పార్టీ గాజు గ్లాస్ కూడా ఉండనున్నట్లుగా అధినేత ప్రకటన ఇవ్వడంతో జనసైనికులు మంచి జోష్ లో ఉన్నారు.