uttam kumar:ఏపీ సర్కార్ వైఖరిపై కాంగ్రెస్ ఫైర్, పోతిరెడ్డిపాడుపై కృష్ణ బోర్డు చైర్మన్కు ఫిర్యాదు..
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు అంశం తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి దారితీసింది. ప్రాజెక్టు పెంపుపై జనవరిలోనే తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని విపక్ష కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వంశీచందర్ రెడ్డితో కలిసి ఎర్రమంజిల్లోని జలసౌధలో కృష్ణ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్తో సమావేశమయ్యారు.
ఫిర్యాదు..
ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని కృష్ణా బోర్డు చైర్మన్కు కాంగ్రెస్ నేతల బృందం వివరించింది. ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే రాష్ట్రంలోని 4 జిల్లాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఉత్తమ్ వివరించారు. ప్రధాని మోడీ, కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాస్తామని తెలిపారు.
జనవరిలోనే..
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు గురించి జనవరి 4వ తేదీన నాగం జనార్థన్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని ఉత్తమ్ గుర్తుచేశారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై జగన్ సర్కార్ వేగంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. అప్పటినుంచి జగన్తో సీఎం కేసీఆర్ రెండుసార్లు సమావేశమయ్యారని.. కానీ ఒక్కసారి కూడా డిస్కస్ చేయలేదని చెప్పారు.
కర్నూలులో సీఈ
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు గురించి ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోందని ఉత్తమ్ చెప్పారు. కర్నూలులో ఉన్న చీఫ్ ఇంజినీర్ను ల్యాండ్ అక్విడేట్ చేయాలని ఆదేశాలు జారీచేసిందన్నారు. సామర్థ్యం పెంచి ఏపీ సర్కార్ రోజుకు 3 టీఎంసీలను రాయలసీమకు తీసుకెళ్తే.. కింద ఉన్న జిల్లాల పరిస్థితి ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు.
సిటీకి తాగునీరు
నాగార్జునసాగర్ కింద ఉన్న రైతులు కూడా నష్టపోతారని చెప్పారు. హైదరాబాద్ సిటీ తాగునీటి ఆధారం కూడా కృష్ణా జలాలే అని పేర్కొన్నారు. తమ ఫిర్యాదుపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ తెలిపారు.