లాయర్ దంపతుల హత్యలో తెర పైకి మరో పేరు.. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు 'బిట్టు శ్రీను'...
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన లాయర్ దంపతుల హత్య కేసులో మరో కొత్త పేరు తెర పైకి వచ్చింది. ఈ కేసులో ఏ-1 నిందితుడు కుంట శ్రీనుకు కారు,కత్తులు సమకూర్చింది బిట్టు శ్రీనివాస్ అనే వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుల జాబితాలో బిట్టు శ్రీనివాస్ పేరు చేర్చకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్కు బిట్టు శ్రీనివాస్ మేనల్లుడు కావడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.
ఎవరీ బిట్టు శ్రీనివాస్...
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తన తల్లి పుట్ట లింగమ్మ పేరిట ఓ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలన్నీ ఆయన మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ చూసుకుంటున్నాడు. వామన్రావు దంపతుల హత్య కేసులో తాజాగా బిట్టు శ్రీనివాస్ పేరు కూడా తెర పైకి వచ్చింది. బిట్టు శ్రీనివాస్ సహకారంతో నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ముందు కుంట శ్రీనుకు బిట్టు శ్రీనివాస్ తన కారుతో పాటు కొబ్బరి బోండాలు కొట్టే కత్తులను ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది.
ప్రజాప్రతినిధికి చెందిన దుకాణం నుంచే...
మంథని పట్టణంలోని ఓ కొబ్బరి బోండాల దుకాణం నుంచి బిట్టు శ్రీనివాస్ కత్తులు తీసుకొచ్చాడని... ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినది అన్న ప్రచారం జరుగుతోంది. బిట్టు శ్రీనివాస్ ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు వెల్లడించారు. అతను దొరికితే కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే హత్యకు సహకరించాడని చెప్తున్నప్పటికీ బిట్టు శ్రీనివాస్ పేరును నిందితుల జాబితాలో చేర్చకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
హత్య చేసింది శ్రీను,చిరంజీవి...
ఈ కేసులో ఏ-1 కుంట శ్రీను,ఏ-2 శివందుల చిరంజీవి,ఏ-3 అక్కపాక కుమార్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు తెలంగాణ సరిహద్దులోని చంద్రపూర్ మీదుగా ముంబై వెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కుంట శ్రీను,చిరంజీవి ఈ హత్యలో పాల్గొనగా.. అక్కపాక కుమార్ వామన్రావు కదలికలపై వారికి సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. కుంట శ్రీను గతంలో సికాసలో పనిచేశాడని,నేర చరిత్ర ఉందని తెలిపారు. చిరంజీవికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు.
ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడనే...
ప్రతీ విషయంలో వామన్రావు కోర్టు కేసులతో తనకు అడ్డుపడుతున్నందునే కుంట శ్రీను ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా మంథనిలో నిర్మించిన ఓ దేవాలయం,కుంట శ్రీను ఇంటి నిర్మాణం విషయంలోనూ వామన్రావు కోర్టులో కేసులు దాఖలు చేయడంతో అతనిపై కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. తన ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతోనే అతన్ని అంతమొందించినట్లు చెప్పారు.