లాక్ డౌన్ ఉన్నా రోడ్లపై జనాలు .. మీకు రూల్స్ వర్తించవా అంటూ క్లాస్ తీసుకున్న కలెక్టర్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది .ఇక ప్రజలు బయటకు వెళ్తూ సమస్యను జఠిలం చేస్తున్న పరిస్థితీపి కేంద్రం అసహనం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ అంటే లాక్ డౌన్ నే అని ఎవరూ బయటకు రావద్దని తేల్చి చెప్తుంది. ఈ మేరకు ప్రభుత్వాలు సైతం అధికారులకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
కరోనాను నియంత్రించాలంటే లాక్డౌన్లు సరిపోవు.. ఏం చెయ్యాలో చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ప్రజలు
ఇక ఈ నేపధ్యంలో తాజా పరిస్థితులు ఆందోళనకరంగా పరిణమిస్తున్న తరుణంలో వివిధ జిల్లాలలో అధికారులు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్తో పట్టణాలు, సిటీలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా ప్రపంచం మొత్తం లాక్డౌన్ అంటుంటే నాకేం కాదు అన్నట్టు ప్రజలు వ్యవహరించటం అధికారులకు నచ్చటం లేదు . కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన నిర్ణయాలను తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినారాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చెయ్యటంతో ఆగ్రహించిన కలెక్టర్ రోడ్ల మీద జనాలకు క్లాస్ పీకారు.
రోడ్ల మీద వాహనదారులకు క్లాస్ పీకిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్
రోజూ లాగే బైక్లు, కార్లు వేసుకుని రోడ్డెక్కుతున్న ప్రజల బాధ్యతా రాహిత్యానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.రోడ్డుపైకి వచ్చిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఇక వాహనాలపై వెళ్లే వారిని ఆపి మరీ క్లాస్ తీసుకున్నారు. ఏంటి మీరు బయటకు ఎందుకు వచ్చారు? నువ్వు ఏమైనా గొప్పోడివా? నీకు ఏమైనా కొత్త రూల్స్ ఉన్నాయా? లాక్ డౌన్ అంటే అర్ధం తెలీదా అంటూ మండిపడ్డారు. కార్లు, బైక్లు , పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు అన్న తేడా లేకుండా ఆపి మరీ క్లాస్ తీసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ..కలెక్టర్ చర్యను సమర్ధించిన నెటిజన్లు
ఇక ఆయన లాక్ డౌన్ రోజున రోడ్ మీద వెళ్తున్న ఓ ఫ్యామిలీని సైతం ఆపి ఆగ్రహం వ్యక్తం చెయ్యటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కలెక్టర్ క్లాస్ తీసుకోవటం ఆగ్రహం వ్యక్తం చెయ్యటంలో తప్పులేదు కదా అంటున్నారు నెటిజన్లు. ఓవైపు కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతుంటే పౌరులు బాధ్యతతో నడుచుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అంతా కలిసికట్టుగా సహకరించాల్సిందేనని పేర్కొంటున్నారు.