తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్: రజనీ-అక్షయ్ 2.O నిలిపివేత, ఐమ్యాక్స్ వద్ద ప్రేక్షకుల ఆందోళన
హైదరాబాద్: ఐమాక్స్ థియేటర్ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. ఎన్నికల సందర్భంగా మార్నింగ్ షోను నిలిపివేశారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న రోబో సినిమా ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
అందరూ ఓటు వేసేందుకు కొందరు ఊళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు తమకు కలిసి వచ్చిన సెలవు రోజును వినియోగించుకునేందుకు వినోదానికి కేటాయించుకున్నారు. ఇందులో భాగంగా కొందరు థియేటర్ వైపు దృష్టి సారించారు. మరికొందరు అప్పటికే ఆన్లైన్లో రజనీకాంత్ - అక్షయ్ కుమార్ల 2.ఓ సినిమాకు టిక్కెట్లు కొనుగోలు చేశారు.
అయితే పోలింగ్ నేపథ్యంలో థియేటర్ నిర్వాహకులు శుక్రవారం మార్నింగ్ షోను ప్రదర్శించలేదు. దీంతో ఈ సినిమా కోసం టికెట్లు పొందిన ప్రేక్షకులు థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. డబ్బులు తిరిగి చెల్లించడంతో వివాదం సద్దుమణిగింది.