మహిళా... రెవెన్యూ ఉద్యోగులకు పెప్పర్ స్ప్రే....!
అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే వారి రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వ్యక్తిగతంగా తమను తాము రక్షించుకోవడం కూడ అవసరం అనే నిర్ణయానికి రెవెన్యూ ఉద్యోగులు వచ్చారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు పెప్పర్ స్ప్రేను తీసుకుని రావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయా ఉద్యోగసంఘాల నేతలతో పాటు ఇతర వర్గాలు అనధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
విజయారెడ్డి ఎఫెక్ట్.... రెవెన్యూ కార్యాలయాల వద్ద ఫుల్ సెక్యూరిటీ...
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల్లో పలు పరిణామాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తమను తాము స్వియ రక్షణ కోసం సిద్దంగా ఉండాలనే సంకేతాలు వారికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందుకోసం పెప్పర్ స్ప్రేను వెంట తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పని చేస్తున్న సుమారు 400 మంది ఉద్యోగులు ఇందు కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం సైతం దిగివచ్చింది. రెవెన్యూ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాడంతో పాటు, పోలీసు రక్షణను తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే జిల్లా కలెక్టర్ల నిధుల నుండి సీసీ కెమెరాలతో పాటు అగ్నిమాపక నివారణ చర్యలను చేపట్టేందుకు పరికరాలను కూడ కొనుగోలు చేయాలని నిర్ణయించింది.