పెట్రో మంట.. డీజిల్ ధర కూడా హై... హైదరాబాద్లో ఇలా
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గత 14 రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పెరుగుదలకు ఆదివారం కాస్త బ్రేక్ పడడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పెట్రో ధరలు ఇక ఆగిపోనున్నాయా అని అందరూ సంతోషపడ్డారు. ఆ ఆనందం ఒక్క రోజులో ఆవిరైపోయింది. సోమవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 90.58 ఉండగా డీజిల్ రూ. 80.97గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ అత్యధికంగా రూ. 97 ఉండగా డీజిల్ రూ. 88.06గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్లో పెట్రోల్ గరిష్ట ధరకు చేరుకుంది. లీటర్ పెట్రోల్ రూ. 94.18 ఉండగా డీజిల్ రూ. 88.31గా ఉంది.
ఏపీ విషయానికొస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త హెచ్చు తగ్గుల్లో కొనసాగుతుండగా.. దేశవ్యాప్తంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ మూలధరల కన్నా పన్నుల భారమే ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పెరుగుదల ఆధారంగా పెట్రో ధరలు పెరుగుతుంటాయి. ప్రతీ రోజు చమురు సంస్థలు ధరలను సమీక్షించి.. నిర్ణయం తీసుకుంటాయి. ఇటీవల వరసగా పెట్రో ధరలు పెరగడంతో.. వాహనదారులు బెంబేలెత్తిపోయారు.