అసెంబ్లీలో భట్టి చెప్పిన యదార్థ గాధ, తుపానుతో కొట్టుకుపోయిన వాగుపై రోడ్డు, కుటుంబంలో విషాదం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సభ ముందుకు యదార్థ గాధను వివరించారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిని వివరిస్తూనే.. తన నియోజకవర్గంలో జరిగిన విషాద ఘటనను ప్రస్తావించారు. నాలుగేళ్ల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన విషాద గాధను సభ ముందుకు తీసుకొచ్చారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అంతా బాగోలేదని భట్టి మల్లు విక్రమార్క పేర్కొన్నారు. ఎక్కడచూసినా.. మోకాల్లోతు గుంటలు ఉన్నాయని.. వాటితో పాదచారులకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. నాలుగేళ్ల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఉదహరించారు. మధిర నియోజకవర్గం ఎరుపాలెం మండలం బనిగెళ్లపాడు, తక్కెళ్లపాడు వాగుపై వంతెన ఉందని గుర్తుచేశారు. అప్పుడు వచ్చిన తుపానుతో రోడ్డు కొట్టుకుపోయిందని వివరించారు. అయితే తర్వాత ఒక బాలుడు చనిపోయాడని పేర్కొన్నారు.
Recommended Video
తుపాన్ తర్వాత.. బనిగెళ్లపాడుకు చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి కుమారుడు వాగులో పడి చనిపోయాడని వివరించారు. రోడ్డు కొట్టుకుపోవడంతో అక్కడికి వెళ్లిన 12 ఏళ్ల బాలుడు కాలుజారి పడిపోయాడనని తెలిపారు. దీంతో వారింట విషాదం నింపిందని పేర్కొన్నారు. ఘటన జరిగి నాలుగేళ్లు అవుతోన్నా.. ఇప్పటికీ రహదారి నిర్మించలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొట్టుకుపోయిన రోడ్లను నిర్మించాలని.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని భట్టి విక్రమార్క సూచించారు. సభ ముందుకు భట్టి విక్రమార్క తీసుకొచ్చిన సమస్యపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. సంబంధిత విభాగానికి సమస్య తీసుకెళ్లి.. దాంతోపాటు, అలాంటి రోడ్లు ఉన్న చోట నిర్మిస్తామని తెలియజేశారు.