పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్పై విజయశాంతి ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా సక్రమంగా ఉపయోగించడం లేదన్నారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకం నిధులు సగం మందికి కూడా అందడం లేదని ఆరోపించారు. ప్రధాని మోడీని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ.. రైతులకు మేలు చేయడంలో కేసీఆర్కు లేదని విమర్శించారు. పీఎం కిసాన్ వర్తించాలంటే ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేసుకోవాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్పథకం నిధులు తెలంగాణ రైతుల్లో సగం మందికి అందడం లేదని విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పాస్బుక్ ఉన్న రైతుల్లో 50 శాతం మందికి మాత్రమే పీఎం కిసాన్ అందుతుందన్నారు. కొత్తగా పాస్బుక్ వచ్చిన లక్షలాది మందిని లబ్ధిదారులుగా గుర్తించట్లేదన్నారు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు పాస్బుక్లు బదిలీ అయినా... పీఎం కిసాన్కు అప్రూవ్ చేయడం లేదు. ఫలితంగా లక్షలాది మంది రైతులు కేంద్రం సాయాన్ని పొందలేకపోతున్నారని వివరించారు.

క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అప్రూవ్ చేసే ప్రక్రియలో జాప్యంతో అర్హులైన వారు కూడా పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు. రైతుబంధు సాయం అందుకుంటున్న వారిలో సగం మందికి కూడా పీఎం కిసాన్ అందని పరిస్థితి నెలకొందని విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా... పీఎం కిసాన్కు 39.67 లక్షల మందినే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి కేంద్రానికి పంపించారు. 17.94 లక్షల మంది పీఎం కిసాన్ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు.
పీఎం కిసాన్ కోసం ఆధార్కు మొబైల్ నంబర్ను లింక్ చేయడానికి ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 31తో ఆ గడువు ముగియనుంది. కిందిస్థాయి అధికారులు పీఎం కిసాన్పై రైతులకు అవగాహన కల్పించడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి అసలు పటించుకోవడం లేదు. రైతులకు పీఎం కిసాన్ ప్రయోజనం అందితే తమకు ఎక్కడ ఓట్లు పోతాయోనని కేసీఆర్ సర్కార్ దీన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.