తీర్మానాలకు ఆమోదం.. తొలి రోజు పూర్తి, ఏర్పాట్లపై మోడీ ఫిదా
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలిరోజు ముగిశాయి. హెచ్ఐసీసీ వేదికగా జరిగిన సమావేశంలో తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దళ అగ్రనేతలు హాజరయ్యారు. కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ బలపరిచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.
మోడీ నాయకత్వంలో భారత్ లో కులతత్వ, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు అడ్డుకట్ట పడిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. ఇప్పుడు అభివృద్ధి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్తో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ నేతలను మోడీ అభినందించారు. సమావేశాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన నేతలను ఆహ్వానించడం దగ్గర నుంచి వారికి బస, భోజనం, ప్రత్యేకించి సమావేశాల కోసం ఏర్పాటు చేసిన వేదికలు అద్భుతంగా ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ పరిస్థితి, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు ఏర్పాట్లు చేశారు.