డ్రంకెన్ పోలింగ్.. ఓటర్లకు "మందు పరీక్ష".. తాగి వచ్చారో అంతే..!
Recommended Video
హైదరాబాద్ : డ్రంకెన్ డ్రైవ్ ల పేరిట పోలీస్ చెకింగ్స్ చూశాం. బ్రీత్ ఎనలైజర్లు పసిగడితే ఫైన్లు కట్టినవారిని చూశాం. ఆ మీటర్లు గిర్రున తిరిగే వింతలు కూడా చూశాం. అయితే ఎన్నడూలేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు మందు పరీక్ష మొదటిసారిగా చూడబోతున్నాం. అదేంటి డ్రంకెన్ డ్రైవ్ లు, ఓటింగ్ కు సంబంధమేంటిని అనుకుంటున్నారా? అక్కడే ఉంది కిటుకు. ఇది డ్రంకెన్ డ్రైవింగ్ కాదు.. డ్రంకెన్ పోలింగ్.
తాజాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో పోలింగ్ బూత్ ల దగ్గర బ్రీత్ ఎనలైజర్లు పెడుతున్నారు పోలీసులు. తాగి వచ్చి ఓటు వేయరాదనే ఈసీ నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మందు తాగి ఓటుకొస్తే.. కేసు
పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో నిలబడే ఓటర్లను బ్రీత్ ఎనలైజర్ల ద్వారా పరీక్షించనున్నారు. తాగి వచ్చేవారు ఓటు వేయొద్దనే ఈసీ నిబంధనమేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసి లిక్కర్ తాగినవారిని గుర్తించనున్నారు. ఒకవేళ ఎవరైనా మందు సేవించినట్లు తేలితే ఓటు వేయనివ్వడమే గాకుండా వారిపై కేసు నమోదు చేయనున్నారు.
బాబోయ్ బ్రీత్ ఎనలైజర్లు
పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు బ్రీత్ ఎనలైజర్లు సప్లై చేశారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి బ్రీత్ ఎనలైజర్లు పంపిణీ చేశారు. ఎంతటివారైనా సరే లిక్కర్ తాగి పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఈసీ నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలని.. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో..?
ఇంతకుముందు ఎన్నడూలేని విధంగా డ్రంకెన్ పోలింగ్ నిబంధన తెరపైకి రావడం చర్చానీయాంశమైంది. పోలింగ్ నాడు సెలవుదినం కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయాన్నే కల్లు సేవించడం పరిపాటి. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కు సమయం ఉండటంతో సహజసిద్ధంగా లభించే కల్లు తాగి కాసింత విశ్రాంతి తీసుకుని ఓటు వేసేవారు చాలామంది ఉంటారు. అయితే కల్లు తాగితే కూడా బ్రీత్ ఎనలైజర్ మీటర్ తిరుగుతుందనే వాదనలున్నాయి. ఈనేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.