పోలింగ్ కేంద్రాల్లో కెమెరా క్లిక్.. ఓటేస్తూ ఫోటోలు, వీడియోలు.. ఇద్దరిపై కేసులు
హైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి ముదురుతోంది. అనువుగానీ చోట కూడా కెమెరా క్లిక్కులకు అంతులేకుండా పోతోంది. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకున్నా.. కొందరు ఇష్టారాజ్యంగా ఫోటోలు తీస్తున్నారు. ఓటు వేసేటప్పుడు సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకం. దాంతో చాలామంది కేసుల పాలవుతూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.
సెల్ఫీల పిచ్చితో కేసుల పాలు..!
జనగామ జిల్లా చిలుపూరుకు చెందిన మహేశ్ అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా తాను ఓటు వేస్తూ వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక పార్టీకి అతడు ఓటు వేస్తున్నట్లుగా ఉంది. అది కాస్తా వైరల్ గా మారింది. దాంతో స్థానిక ఎస్సై శ్రీనివాస్ ఆ వ్యక్తి ఎవరని ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలోని 26వ పోలింగ్ బూత్లో ఓటు వేసిన మహేశ్గా గుర్తించారు. దాంతో అతడిపై కేసు నమోదు చేశారు.
టీఆర్ఎస్తో ఏడేళ్లు.. కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా పోటీ.. ఓటమి భయంతో సూసైడ్..!
మంచిర్యాల జిల్లాలోనూ కేసు..!
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బెన్పల్లిలో కూడా.. అలాగే ఓటు వేసి బ్యాలెట్ పత్రం ఫొటో తీసిన సందెల రవీందర్ అనే వ్యక్తిపైనా కూడా కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అలాంటి ఘటన జరిగింది. బూర్గం పహాడ్ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓ యువకుడు తాను ఎవరికి ఓటు వేస్తున్నాడో తెలిసేలా వీడియో తీశాడు. ఒక పార్టీ గుర్తుపై ఓటు వేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ యువకుడిపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
గతంలో కూడా కేసులు నమోదు..!
ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరి తీరు మాత్రం మారడం లేదు. ఎక్కడా లేని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఏరియాలోని ఉప్పరపల్లికి చెందిన శివశంకర్ ఓటేస్తూ ఫోటో దిగి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తించడంతో అతడి విషయం బయటపడింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు శివశంకర్ను అదుపులోకి తీసుకుని సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ లీడర్ వెంకటేశ్ కటకటాల పాలు కావడం హాట్ టాపికయింది. మల్కాజ్ గిరి లోక్సభ సెగ్మెంట్ లోని టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించిన సదరు నేత అడ్డంగా బుక్కయ్యాడు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను హోలి మేరీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అయితే ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అక్కడ వెంకటేశ్ సరాదాగా సెల్ఫీ దిగడంతో పాటు వీడియో తీశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
బిల్డప్ వద్దు.. రూల్స్ తెలుసుకోండి..!
ఎన్నికల సంఘం నిబందనల మేరకు పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించరు. ఒకవేళ తీసుకెళ్లినా కూడా.. ఓట్లు వేసేటప్పడు ఫోటోలు గానీ, వీడియోలు తీయడం గానీ నేరం కింద పరిగణిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైన ఆయుధం కావడంతో.. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలన్నది ఎన్నికల సంఘం రూల్. కానీ చాలామంది తెలిసో తెలియక ఓట్లు వేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. అక్కడితో ఆగకుండా అదేదో గొప్పగా భావించి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చివరకు కేసుల పాలయి కష్టాలు పడుతుండటం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. యువతలో మాత్రం సెల్ఫీల పిచ్చి తగ్గడం లేదు. దోస్తుల దగ్గర ఏదో బిల్డప్ ఇద్దామని ఇలా ఫోటోలు దిగుతూ చివరకు ఊచలు లెక్కించాల్సి వస్తోంది.