అఖిలప్రియకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక వివరాల వెల్లడి... నేడు సీన్ రీకన్స్ట్రక్షన్.. తేలనున్న బెయిల్..?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్న బోయ సంపత్ కుమార్,మల్లికార్జునరెడ్డిలు తాజా పోలీస్ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ ఉదంతం మొత్తం అఖిలప్రియ డైరెక్షన్లోనే జరిగిందని నిందితులు పోలీసులతో చెప్పినట్లు సమాచారం. సిమ్ కార్డుల కొనుగోలు,విజయవాడ నుంచి వచ్చిన గ్యాంగ్కి లాడ్జి గదులు బుక్ చేయడం... ఇవన్నీ అఖిలప్రియ ఆదేశాల మేరకే చేశామని నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది.

కీలక వివరాలు వెల్లడి...
కిడ్నాప్ కేసులో అరెస్టయిన బోయ సంపత్ కుమార్,మల్లికార్జునరెడ్డిలు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు బుధవారం వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. కిడ్నాప్ ఉదంతంలో అఖిలప్రియే కీలక సూత్రధారి అని వీరు చెప్పినట్లు తెలుస్తోంది. 'అఖిలప్రియ ఆదేశాలతోనే అన్నీ చేశాం... సిమ్ కార్డులు కొన్నాం... గుంటూరు శ్రీను స్నేహితులమంటూ విజయవాడ నుంచి వచ్చిన గ్యాంగ్కి కూకట్పల్లిలో లాడ్జి గదులు బుక్ చేశాం.' అని పోలీసులతో నిందితులు చెప్పినట్లు సమాచారం.

ఆమె ఆదేశాలతోనే రెక్కీ
అఖిలప్రియ ఆదేశాల మేరకే చెన్నయ్యతో కలిసి బోయినపల్లిలోని ప్రవీణ్ రావు ఇంటి వద్ద నాలుగైదు సార్లు రెక్కీ నిర్వహించినట్లు నిందితులు పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేసిన తీరును తెలుసుకునేందుకు గురువారం(జనవరి 21) పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లనున్నారు. ప్రవీణ్ రావు ఇంట్లోకి ఎలా చొరబడ్డారు.. బలవంతంగా కారులో కూర్చోబెట్టి ఎలా అక్కడినుంచి తరలించారు...ఏయే చోట్ల వారిని కారులో తిప్పారు... డాక్యుమెంట్స్పై సంతకాలు తీసుకునే సమయంలో వారిని ఎలా బెదిరించారు తదితర అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది.

బెయిల్పై తేలేది నేడే..
మరోవైపు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వ్యవహారం కూడా గురువారం(జనవరి 21) తేలిపోనుంది. సికింద్రాబాద్ సెషన్ కోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా.. కోర్టు విచారణను గురువారంకు వాయిదా వేసింది. దీంతో అఖిల ప్రియ బెయిల్పై సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే రెండుసార్లు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తాజా పిటిషన్పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ గతంలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు.

కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ సెషన్ కోర్టులో పోలీసులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ-భార్గవ్ రామ్ల ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉన్నాయని.. కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయవద్దని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అఖిలప్రియ సహా 19 మందిపై కేసు నమోదుచేశారు. కిడ్నాప్ కేసు విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేస్తున్నారు.