కీచక పోలీసులను కాపాడుతున్నది ఎవరు.. వారికి అండ దండగా ఉన్నదెవరు ..? (వీడియో)
హైదరాబాద్ : మెడికల్ విద్యార్థినిపై తాకరాని చోట తాకాడో ఖాకీ .. ఐఏఎస్ అధికారి వీపుపై చేయివేసి కీచకంగా ప్రవర్తించాడో ఏసీపీ. ఇదీ హైదరాబాద్ నడిబొడ్డున మెడికల్ విద్యార్థుల పట్ల భాగ్యనగర పోలీసులు వ్యవహరించిన తీరు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే .. అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజా సమస్యలు తీరుస్తాం, సఖ్యతగా ఉంటామని చెప్తున్న ఖాకీల ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిరసన తెలిపితే ..
ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం హక్కు. రాజ్యాంగమే ఆ రైట్ కల్పించింది. ఇందులో అనుమానాలకు తావులేదు. కానీ బుధవారం చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రి వద్ద విద్యార్థినుల పట్ల ఖాకీలు ప్రవర్తించిన తీరుపై యావత్ సమాజం మండిపడుతుంది. విద్యార్థినుల పట్ల ఇలా ప్రవర్తించడం ఏంటని సభ్యసమాజం ప్రశ్నిస్తోంది. ఖాకీల కీచక చర్యను ముక్తకంఠంతో తప్పుపడుతోంది. ఇంతా జరుగుతున్నా పోలీసు బాస్లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. అవునా .. అనుచితంగా ప్రవర్తించారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే డ్యూటీలో ఉన్న ఖాకీలు ఏం చేసినా ఫర్లేదా అనే సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు.
ఏం జరిగిందంటే ..
బుధవారం వైద్య విద్యార్థినులపై కానిస్టేబుల్ పరమేశ్ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆమెను కాలితో తన్ని, గిల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఇతడే అంటే ఇతని బాస్ ఏసీపీ ఆనంద్ .. బాస్ అన్నట్టు పరమేశ్ కంటే నీచంగా ప్రవర్తించాడు. వైద్య విద్యార్థినిని తాకరాని చోట తాకాడు. తర్వాత ఊరుకోలేదు కీచక ఆనంద్ .. ఐఏఎస్ అధికారిణి వీపు చేయి వేసి తీసుకెళ్లాడు. వీరు చేసిన కీచకపర్వం రికార్డైంది. ఇంతవరకు జరిగిన ఘటక కదా .. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను మీడియా ప్రతినిధులు వివరణ కోరితే ఏం చెప్పారో చూడండి.
పరిశీలిస్తరట ..
జరిగిన ఘటన కళ్లముందు ఉంటే ఏం జరిగింది చూసి చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు వారి పై అధికారి డీసీపీ అంబర్ కిషోర్ ఝా. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంటే .. మన అధికారి మాత్రం పరిశీలిస్తారాని పేర్కొన్నారు. ఖాకీలు చేసిన పనిని చిత్రీకరిస్తే .. కొందరు ఉద్దేశపూర్వకంగా చేశారని నింద ఆపాదించారు. అంతేకాదు మహిళలు, యువతులంటే తమకు గౌరవం ఉందని .. లేని పదాన్ని ఉచ్చరించారు. వారు అలా ఎందుకు ప్రవర్తించారంటే .. శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీ భద్రత సందర్భంగా ఇలా బీహేవ్ చేస్తారని సుద్దులు చెప్పారు. వాస్తవాలు తెలుసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని నెటిజన్లపై గుర్రుమన్నారు. తప్పుచేసిన వారిని వదిలేసి మిగతావారిని కార్నర్ చేయడం ఏంటని పౌర సమాజం పోలీసులను నిలదీస్తోంది.
కాపాడుతుంది ఎవరు ..
కానిస్టేబుల్ పరమేశ్, ఏసీబీ ఆనంద్లను కాపాడుతుంది ఎవరో అర్థమైంది కదా. ఇంకెవరు వారి బాసులే. కళ్లముందు వీడియో స్పష్టంగా కనిపిస్తుంటే అవునా అంటు బీరాలు పలుకడం దేనికి సంకేతం. అదే సాధారణ పౌరులు, మిగతా వారు ఇలాంటి చర్యలు చేస్తే ఊరుకుంటారా ? గంటల్లో పట్టుకొని తాటతీస్తారు. మరి పోలీసులు చేస్తు చర్యలుండవా ? వారికో న్యాయం, మిగతావారికో న్యాయమా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే, సమన్యాయ పాలన జరగాలి .. కానీ హైదరాబాద్ పోలీసులను కాపాడుతున్నది ఎవరు ? వారిని వెనకేసుకొస్తున్నది ఎవరు ? చర్యలు తీసుకోనిది ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది. ఔను వారు బాసులో వారిని కాపాడుతున్నారు. తమ ఉద్యోగుల పట్ల విధేయత చూపుతూ పక్షపాతం చూపుతున్నారు. ఇదీ మన పోలీసుల తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే .. మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేనని సంకేతాలిస్తున్నారు. విశ్వనగరంలో పోలీసులు ఇలానే ఉంటారని పోలీసు బాసులు చెప్తున్నారు.