సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసుల నిర్లక్ష్యం! పని చేయక పోయినా పట్టించుకోని వైనం!
హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో నేరాలను నియంత్రించేందుకు ఉన్నతాదికారులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పట్ల స్ధానిక పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కెమరాలు అమర్చిన తర్వాత అవి కిందకో, పక్కకో వంగిపోవడం, సరైన డైరెక్షన్ లో దృశ్యాలను రికార్డ్ చేయలేకపోవడం, కేబుల్స్ తెగిపోయి ఫుటేజ్ రికార్డ్ అవ్వకపోయినా పట్టించుకోక పోవడం, ఏదైయినా జరగరాని ఘటన జరిగినప్పుడు ఫుటేజ్ చూపించడంలో పోలీసుల అలసత్వం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అసలు పోలీసు యంత్రాంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన సీసీ కెమెరాల పర్యవేక్షణ కొంత మంది అలసత్వం వల్ల నిర్వీర్యమైపోతున్నట్టు స్పష్టమవుతోంది.
నిఘా నేత్రంపై నిర్లక్ష్యం ముసుగు..
తాజాగా సనత్ నగర్ పరిధిలోని మూసాపేట, భరత్ నగర్, జింకల్ వాడ, ముష్కిపేట, జనతా నగర్, ఎస్పీ నగర్, గూడ్స్ షెఫర్డ్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల పరిస్దతి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు తెలుస్తోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మూసాపేట ప్రధాన రహదారిలో మద్యం షాపులతో పాటు జనతా బార్లు ఎక్కువగా ఉండడంతో ఆకరతాయి తాగుబోతులు రెచ్చి పోతున్నట్టు తెలుస్తోంది. రాత్రి పదిగంటల సమయంలోలే తాగుబోతులు అమాయకుల మీద తమ ప్రతాపం చూపిస్తున్నా సరైన పోలీసు నిఘా లేనట్టు తెలుస్తోంది.
నేరాలను నియంత్రించాలన్నది ఉన్నతాదికారుల లక్ష్యం.. కాని నిర్లక్ష్యం వహిస్తున్న క్రింది స్ధాయి అదికారుల..
అంతే కాకుండా కుటుంబ సభ్యులతో వెళ్తున్న వారి కారు అద్దాల మీద బీరు సీసాలతో ఎటాక్ చేసి పారిపోతున్న సంఘటనలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడనే చర్చ జరుగుతోంది. ఇలాంటి దుర్ఘటనలకు సీసీ కెమెరాల సాక్ష్యంగా నిలుస్తున్నా సాంకేతిక కారణాలతో ఫుటేజీ రికార్డ్ కావడంలేదు. దీంతో తాగుబోతుల ఆగడాలు హద్దు లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ పట్ల పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలకు బాధ్యులను సులువుగా గుర్తించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా గుర్తించలేకపోతున్న పోలీసులు.. నిర్వహణపై ఖర్చు వృధా అంటున్న ప్రజలు..
అంతే కాకుండా ప్రమాదాలు, చైన్ స్నాచింగ్ లు, గొడవలు జరిగినప్పుడు ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి ఈ సీసీ కెమెరాల ద్వారా విచారణ నిర్వహించడం చాలా తేలిక. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆధారాలు సులువుగా లభించడం వలన కేసులు త్వరితగతిన ఛేదించుటకు పోలీసులకు ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఉన్నతాదికారుల ఉన్నత లక్ష్య్యం మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాని నిర్వహణ, పోలీసుల అలసత్వం కారణంతో అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాదికారులు కఠినంగా ఉండాలంటున్న ప్రజలు.. నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించే చర్యలు ఉండాలంటున్న స్ధానికులు..
సీసీ కెమెరాలు ఏర్పాటులో ఉత్సాహం చూపించిన పోలీసు అధికారులు వాటి పర్యవేక్షణ పట్ల చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వాటిని ఏర్పాటు చేసినా ఉపయోగం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేటప్పడు అవి సరిగ్గా పనిచేసేట్టు పర్యవేక్షించాల్సిన బాద్యత కూడా పోలీసులదేనని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైన పోలీసు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో చూపిస్తున్న శ్రద్ద, పర్యవేక్షణపై కూడ చూపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.