పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం.. ఫిర్యాదు చేయడం ఇక ఈజీ..!
హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే బాధితులకు ఆ కష్టాలేంటో తెలుసు. కొన్ని సందర్భాల్లో న్యాయం కోసం ఒక పోలీస్ స్టేషన్కు వెళితే తమ పరిధిలోకి రాదంటూ.. మరో పోలీస్ స్టేషన్కు వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇచ్చే పోలీసులు తారసపడి ఉంటారు. అదలావుంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు బాధితులు పరుగెత్తుకెళ్లి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చూస్తే.. అది తమ పరిధిలోకి రాదంటూ అక్కడి పోలీసులు సమాధానం చెప్పుతున్న సందర్భాల్లో నేరగాళ్లు అప్పటికే చాలా దూరం పారిపోయి ఉంటారు. అయితే ఇలాంటి బాధలకు చెక్ పెట్టడానికే పోలీస్ ఉన్నతాధికారులు ఆయా పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
పరిధి సమస్య.. బాధితులకు తప్పని తిప్పలు
నేరాలు జరిగినప్పుడు ఇది మా పరిధిలోకి రాదంటూ పోలీసులు చెప్పే తీరు కామన్. ఎందుకంటే చట్టాల ప్రకారం ఏ పరిధిలో నేరం జరిగితే అదే పరిధిలోని పోలీసులు దర్యాప్తు చేయాలనేది కానూన్ ఉందట. అందుకే చాలా సందర్భాల్లో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పుడు.. మా పరిధిలోకి రాదంటూ వేరే పోలీస్ స్టేషన్కు వెళ్లాలనే సూచనలు వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయంలో బాధితులు అసంతృప్తికి గురవుతారు. అక్కడకు ఇక్కడకు తిప్పుతున్నారంటూ విసుక్కునే సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి.
ఆ క్రమంలో ఇలాంటి ఫిర్యాదులు డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన సరికొత్త ఆలోచనకు తెర తీసినట్లు తెలుస్తోంది. బాధితులను అటు ఇటు తిప్పకుండా సరిగ్గా ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లాలో తెలిస్తే ఇలాంటి ఇబ్బందులు రావు కదా అనేది ఆయన అభిప్రాయం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు డిజిటల్ అడ్రస్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు. త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం రానుంది.
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!
పరిధి అనేది పోలీసులకు కూడా తలనొప్పి వ్యవహారమే..!
నేరాలు జరిగినప్పుడు కేసులు నమోదు చేయాలన్నా.. ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నా.. పోలీసులకు తలనొప్పి వ్యవహారమే. ఎందుకంటే అది ఏ పరిధిలోకి వస్తుందనేది చూసుకున్నాక గానీ కేసు ఫైల్ చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ తమ పరిధిలోకి రాకున్నా.. కేసులు బుక్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరుకున పడతారు. చట్టపరంగానే కాదు ఇతరత్రా డిపార్టుమెంటల్ సమస్యలు కూడా వారికి తలనొప్పిగా మారతాయి. అందుకే బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పుడు నేరం ఎక్కడ జరిగిందంటూ గుచ్చిగుచ్చి అడుగుతారు.
అయితే నేరం జరిగిన ప్రాంతం, సందర్భం.. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో బాధితులకు ఎట్లా తెలుస్తుంది. అందుకే సమీపంలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంటారు. చిన్న చిన్న పట్టణాలైతే ఒకటే పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఒకటికి మించి పోలీస్ స్టేషన్లున్న ప్రాంతాల్లో గానీ.. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గానీ నేరాలు జరిగిన ప్రదేశాలను బట్టి అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో చెప్పడం కష్టమే.
హాక్ -ఐ.. ఇక ఈజీయే
పోలీస్ శాఖ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న తరుణంలో మరో ప్రయోగానికి తెర తీస్తోంది. ఇక పోలీస్ స్టేషన్ల చిరునామాలు స్మార్ట్ఫోన్లలో తెలుసుకునేలా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చింది. పోలీస్ స్టేషన్లకు జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ అధికారిక యాప్ ఐన హాక్ - ఐ తో అనుసంధానం చేయబోతున్నారు.
ఈ విధానంతో ఇకపై స్మార్ట్ఫోన్లలో ఎవరైనా సరే తాము ఉన్న ప్రాంతం ఏ పీఎస్ పరిధిలోకి వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఆ పోలీస్ స్టేషన్కు ఎలా వెళ్లాలో కూడా డైరెక్షన్ చూపిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేది డీజీపీ యోచనగా తెలుస్తోంది. ఇది గనక సక్సెస్ అయితే ఇటు బాధితులకు అటు పోలీసులకు తలనొప్పులు తప్పినట్లే. ఏ ప్రాంతంలో నేరం జరిగిందో అదే పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చన్నమాట.