'శిఖాచౌదరి పాత్ర ఉన్నట్లు తేలలేదు, జయరాంను హత్య చేసి రాకేష్ రెడ్డి వీడియో తీశాడు'
హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో పోలీసులు ముగ్గురిని మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విశాల్, నగేశ్, సుభాష్ చంద్రారెడ్డిని అరెస్ట్, చేసి మీడియా ముందుకు తీసుకు వచ్చారు. జయరాం హత్య గురించి డీసీపీ మాట్లాడారు. ప్లాన్ ప్రకారమే జరిగిందని, ఈ కేసులో పలు కోణాలున్నాయన్నారు.
ఈ కేసులో ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం ఎస్సై రాంబాబుతో సహా అయిదుగురు పోలీసు అధికారులను విచారించామని చెప్పారు. హత్యలో తమ ప్రమేయం లేదని పోలీసు అధికారులు చెప్పారన్నారు. అయినప్పటికీ వారిని ప్రశ్నిస్తామని చెప్పారు. జయరాం ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లిందనే ఫిర్యాదుపై శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామన్నారు.
ఈ హత్యలో శిఖాచౌదరి పాత్ర ఉన్నట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలలేదని స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి ఆమెను విచారిస్తామన్నారు. జయరాంకు నాలుగున్నర కోట్ల రూపాయలు రాకేష్ రెడ్డి అప్పుగా ఇచ్చారని చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్నారు. జయరాంను హత్య చేసే సమయంలో రాకేష్ రెడ్డి తన ఫోన్లో వీడియో తీశాడన్నారు. వాటిని కూడా సేకరించామన్నారు.
జయరాంను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత హత్య చేశారని విచారణలో తేలిందన్నారు. బెదిరించి కొట్టారని, ఆ తర్వాత హత్య చేశారని చెప్పారు. రాకేష్ రెడ్డికి డబ్బులు ఇచ్చేందుకు జయరాం దాదాపు పది మందికి ఫోన్లు చేశారని, చిత్రహింసలకు గురిచేసి ఖాళీ బాండు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారన్నారు.
రాకేష్ రెడ్డిని విచారించామని, శిఖా చౌదరి పాత్ర గురించి చెప్పలేదని తెలిపారు. విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆమె పాత్రపై చెబుతామని అన్నారు. శిఖాచౌదరికి సంబంధించి రాకేష్ రెడ్డికి ఇవ్వాల్సిన ఒకటిన్నర కోట్ల రూపాయలు డబ్బు చెల్లిస్తానని జయరాం ఒప్పుకున్నారన్నారు. ఈ హత్య జరిగినట్లు శిఖా స్నేహితుడు సంతోష్ ఆమెకు ఫోన్ ద్వారా తెలిపాడన్నారు.