పిల్లలు ముచ్చట పడ్డారని రక్షక్ వాహనం ఇచ్చారా ? హైదరాబాద్ లో హారన్ మోత, ర్యాష్ డ్రైవింగ్ ...
రాచకొండ : దొంగలు, నేరగాళ్లను పట్టుకునేందుకు హై ఎండ్ మోడల్ వాహనాలను పోలీసుల కోసం ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక డిపార్ట్మెంట్ కోసం ప్రభుత్వం అధికంగా నిధులు వెచ్చించింది. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి .. పోలీసులకు ఆధునాతన వాహనాలను సమకూర్చింది. ఇన్నోవా క్రైస్టా, స్కార్కియో లాంటి వాహనాలు .. వాటిలో సాయుధలైన నాలుగు నుంచి ఐదుగురు పోలీసులు ఉంటారని .. దీంతో నేరం చేయాలంటే భయపడాలని ప్రభుత్వ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. అయితే రియాలిటీ మాత్రం వేరు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన వాహనాలు పోలీసుల చేతుల్లో కాక వారి బంధుగణం చేతిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
కారులో రయ్ .. రయ్ ...
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లో పోలీసు వాహనంపై ముగ్గురు యువకులు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. ఇది అప్పట్లో హల్ చల్ చేసింది. చాన్నాళ్ల తర్వాత ఎల్బీ నగర్లో అలాంటి ఘటనే జరిగింది. కానీ ఈ సారి బండి కాదు .. కారు దూసుకెళ్లింది. గస్తీ వాహనంలో నలుగురు కుర్రాళ్లు సైరన్ వేసుకుంటూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ముందుకుసాగారు. తొలుత ఎవరైనా పై అధికారి వెళ్తున్నారా ? లేదంటే కాన్వాయ్ వాహనమా ? అని పోలీసులు భావించారు. కానీ అందులో నునుగు మీసాల కుర్రాళ్లు ఉండటంతో వీరెవరు అనే చర్చ జరిగింది. వీరిలో ఒకడు .. పోలీసు అధికారి కుమారడని తేలింది. తన డాడీ సొంత వాహన అనుకున్నాడో ఏమో కానీ .. తన ఫ్రెండ్స్తో షికారుకెళ్లాడు. అదీ కూడా నగర నడిబొడ్డున .. హరన్ వేస్తూ .. ర్యాష్ డ్రైవింగ్ చేశాడు.
ఇచ్చారా .. తీసుకున్నారా ?
అది పోలీసు గస్తీ వాహనం. ఆ కుర్రాళ్లకు ఎవరిచ్చారు. సదరు యువకుడు తండ్రి ఇచ్చాడా ? లేదా వీళ్లే తీసుకొచ్చారా అనే ప్రశ్న తలెత్తుతంది. ఏదీ ఏమైనా కానీ శాంతిభద్రతల కోసం కోట్లు ఖర్చుచేసి కొనుగోలు చేసిన వాహనాలు .. ఇలా దుర్వినియోగం అవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు కార్లలో ఏసీ వేసీ మరీ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫై అధికారుల పనుల కోసమో .. మార్కెట్ కోసమో వెళ్లే సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు మరికొందరు సరదాగా షికారు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
చర్యలు తీసుకొండి బాస్ ...
ఈ క్రమంలో పోలీసు అధికారులు కుమారులు ప్రభుత్వ వాహనంలో రయ్ మంటూ వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి .. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరికొందరు కుర్రకుంకలు చేతిలో ప్రభుత్వ వాహనాలు వెళ్లే అవకాశం ఎంతైనా ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముందే మేల్కొని మరో ఘటన జరగకుండా పోలీసు బాస్ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.