పోలింగ్ డే హాలిడే.. ఐటీ కంపెనీలకు ఈసీ ఆదేశం..!
హైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికలు.. అటు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ జరిగే గురువారం (11.04.2019) నాడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవుదినంగా ప్రకటించాయి. అయితే కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వకపోవడం చర్చానీయాంశమైంది.
ఏపీ, తెలంగాణకు చెందిన యువత హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే పోలింగ్ తేదీని కొన్ని సంస్థలు సెలవుదినంగా ప్రకటించాయి. అదలావుంటే మరికొన్ని కంపెనీలు ప్రాజెక్ట్స్ పూర్తికాలేదంటూ హాలిడే ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఎవరైనా కాదు కూడదని డుమ్మా కొడితే తగిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాయట. దాంతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేయని పరిస్థితి నెలకొంది.
నిజాయితీ లీడర్లు కనబడుట లేదు.. 'నోటా' కు ఓటు..! యువజంట వినూత్న ప్రచారం
పోలింగ్ నాడు సెలవు లేదంటూ మొండికేసిన ఐటీ కంపెనీల తీరుపై.. ఫోరమ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయిస్ ప్రతినిధులు మండిపడుతున్నారు. హాలిడే ఇవ్వకుండా సతాయిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. వీరి వినతి మేరకు స్పందించిన ఈసీ అధికారులు.. గురువారం కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఐటీ కంపెనీలను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.