ఏంది సుధాకరన్నా.. అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. అందుకేనా కాంగ్రెస్కు గుడ్బై..!
హైదరాబాద్ : రాజకీయమంటేనే ఉల్టా పల్టా వ్యవహారం. ఇవాళ ఈ గూటిలో ఉండే నేతలు.. రేపటికల్లా ఏ గూటికి వెళతారో తెలియదు. పార్టీలో ఉన్న సమయంలో వీరవిధేయులుగా ఉంటారు. ఒక్కసారి గడప దాటి బయటకొచ్చి కండువా మారితే చాలు.. ఆ పార్టీ నేతలు శత్రువుల్లా కనిపిస్తారు. ఇగ అప్పటి కోపం.. ఇప్పటి ఆగ్రహం అంతా కలగలిపి తిట్ల దండకం మొదలెడతారు.
కాంగ్రెస్ నుంచి జంప్ చేసి కమల తీర్థం పుచ్చుకున్న పొంగులేటి సుధాకర్ రెడ్డిది అదే కథ. కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులు వీరవిధేయుడిగానే ఉన్నారు. బీజేపీలోకి రాగానే హస్తం గూటి నేతలపై మాటల యుద్ధం షురూ జేశారు.
కాంగ్రెస్ సీనియర్లపై పొంగులేటి ఆగ్రహం
ఒకప్పటి కాంగ్రెస్ నేత.. ఇప్పటి బీజేపీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి హస్తం గూటి నేతలపై మాటల యుద్దం ప్రకటించారు. కాంగ్రెస్ నేతల విధానాలు అనుసరణీయం కావంటూ ఫైరయ్యారు. తీవ్రవాదులకు కొమ్ము కాస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుస్తీ పడుతోందని ఆరోపించారు. టెర్రరిస్టుల హింసావాదాన్ని వ్యతిరేకించాల్సింది పోయి అవకాశంగా మలచుకోవాలనుకోవడం చూస్తుంటే ఆ పార్టీ భ్రష్టు పట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీని తీవ్రవాదులే చంపారనే విషయం వారు పూర్తిగా మరచిపోయారని వ్యాఖ్యానించారు.
పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఉగ్రదాడులను అందరూ వ్యతిరేకిస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు పాకిస్తాన్కు వత్తాసు పలికే విధంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆ క్రమంలోనే తాను ఆ పార్టీకి గుడ్బై చెప్పాల్సి వచ్చిందన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో కెమెరా క్లిక్.. ఓటేస్తూ ఫోటోలు, వీడియోలు.. ఇద్దరిపై కేసులు
మేధావులమని భావించే వారితో ఆ పార్టీకి నష్టం
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరిని ఏమనని పొంగులేటి.. తాజాగా కాంగ్రెస్ సీనియర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హస్తం గూటిలో మేధావులమని భావించే కొందరు నేతల తీరు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తోందన్నారు. అందుకే ఆ పార్టీ పేరు మంటగలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇదే విషయం తాను పార్టీని వీడి బయటకొచ్చే సమయంలో రాహుల్ గాంధీకి వివరిస్తూ లేఖ రాశానని చెప్పుకొచ్చారు.
బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసే నేతలను అదుపులో పెట్టాలని సూచించినట్లు తెలిపారు. ఇంతవరకు అది జరగకపోగా.. ప్రధాని నరేంద్ర మోడీ మీద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ సీనియర్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మోడీకి సాటిలేరు.. మరోసారి ఆయనే ప్రధాని..!
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రచారం కోసం వెళ్లానని.. ఎక్కడు చూసినా కూడా మోడీ ప్రభంజనమే కనిపించిందన్నారు. మోడీకి దీటైన లీడర్ లేరని వ్యాఖ్యానించారు. అందుకే గల్లీ స్థాయి లీడర్ కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నామంటూ చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా.. రకరకాల కూటములొచ్చినా.. మరోసారి ప్రధాని అయ్యేది మోడీ మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అపర మేధావిగా చెప్పుకునే శామ్ పిట్రోడా ఇటీవల సిక్కుల ఊచకోతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతోందని మండిపడ్డారు. ఆయన సిక్కులకు క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీ కంటితుడుపుగా ప్రకటన చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే శామ్ పిట్రోడాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.