పాపులారిటీతోనే సమస్యలు, ఇదో అనుభవం: ఈడీ విచారణపై విజయ్ దేవరకొండ
హైదరాబాద్: మీ ప్రేమాభిమానల వల్ల వచ్చే మనకొచ్చే పాపులారిటీతో కూడా కొన్ని సమస్యలొస్తాయని.. వాటిలో ఇదొకటని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. బుధరవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు తెలిపారు.
పాపులారిటీతో సమస్యలు, సైడ్ ఎఫెక్టులంటూ విజయ్ దేవరకొండ
మీరు చూపించే ప్రేమ అభిమానం వల్ల వచ్చే పాపులారిటీతో ఇలాంటి ఇబ్బందులు.. సైడ్ ఎఫెక్టులు ఎదురవుతాయని. జీవితంలో ఇదొక అనుభవం. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. లైగర్ సినిమా లావాదేవీలపైనే ఎక్కువ ప్రశ్నలడిగారు. ఎక్కువమాట్లాడితే వాళ్లు ఫీలవుతారు. నన్ను మళ్లీ రమ్మని చెప్పలేదు అని విజయ్ దేవరకొండా తెలిపారు.
11 గంటలపాటు విజయ్ దేవరకొండను విచారించిన ఈడీ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా, బుధవారం విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటలపాటు ఈడీ అధికారులు విజయ్ని ప్రశ్నించారు.
‘లైగర్'కు డబ్బులు ఎలా?
దుబాయికి డబ్బులు పంపించి, అక్కడి నుంచి తిరిగి సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే లైగర్ సినిమాలో భాగస్వాములైన వారిని అధికారులు విచారిస్తున్నారు. హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ వెలువడిన లైగర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈడీ విచారణలతో తాజాగా, ఈ సినిమా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నారు. 80 శాతం వరకు పూర్తయిన ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉండనుంది.