ప్రజలపై చార్జీల మోత, కరెంట్ చార్జీల పెంపు..? అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్..
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు కరెంట్ చార్జీలను పెంచబోతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వల్పంగా ధరలు పెంచుతామని ప్రజలు సహకరించాలని కోరారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. కరెంట్ చార్జీలు భరించే వర్గాలకు మాత్రం పెంపు ఉంటుందని, కానీ ఎంత మొత్తంలో పెంచుతామనే అంశంపై మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే.. వ్యవస్థలు నీరుగారిపోయాయని విమర్శించారు. వాటిని సరిదిద్దేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
ఆర్థికభారం..
విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం పడుతోందని సీఎం కేసీఆర్ వివరించారు. అందుకోసమే విద్యుత్ ధరల పెంపుపై సమీక్షించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు దళితులు, గిరిజనులకు 101 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని స్పష్టంచేశారు. వారికి పవర్ చార్జీ పెరగబోదని.. నిరుపేదలకు కూడా హైక్ ఉండబోదని చెప్పారు. చార్జీ చెల్లించే స్థోమత ఉన్నవారికి మాత్రమే పెంచుతామని చెప్పారు.
దారి తప్పడంతోనే..
ఇదివరకు అన్నివ్యవస్థలకు నియంత్రణ ఉండేది కాదన్నారు. అందుకోసమే ఎక్కడి చెత్త అక్కడే ఉండేదని చెప్పారు. గతంలో కరెంట్ పోతే ఆరుగంటలు పోయేదని సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యాహ్నం వచ్చేది కాదని.. కొన్ని సందర్భాల్లో రాత్రుళ్లు కూడా కరెంట్ లేని పరిస్థితి అని వివరించారు. ఒకవేళ రాత్రి కరెంట్ వస్తే సింగిల్ ఫేజ్ వచ్చేదని.. దీంతో పంటకు నీరు పెట్టడం సాధ్యం కాకపోయేదని చెప్పారు.
24 గంటల కరెంట్..
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందజేస్తున్నామని చెప్పారు. సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు చార్జీలు కూడా భరించాలి కదా అని ప్రశ్నించారు. ఒకవేళ విద్యుత్ చార్జీలు పెంచకుంటే సంస్థ మనుగడ ఏమవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద మనస్సుతో విద్యుత్ చార్జీల పెంపును అర్థం చేసుకోవాలని కోరారు.
Recommended Video
చార్జీల మోత
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచుతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.. కానీ ఎంత మొత్తంలో పెంచుతాం, ఎప్పటినుంచి పెంపు ఉంటుందనే విషయం వెల్లడించలేదు. దీంతో చార్జీల మోత తప్పదని.. కానీ ఏ స్థాయిలో పెంచుతారనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది.