తెలంగాణలో కరెంట్ కష్టాలా.. రెండు రోజులు దాటితే చీకట్లేనా?
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయా? ఇన్నాళ్లు 24 గంటల కరెంటుకు అలవాటుపడ్డ జనాలు పవర్ కట్స్ చూడనున్నారా? మరో రెండు రోజులు దాటితే చీకట్లు తప్పవా? రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం తప్పదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముందస్తు చెల్లింపుల హామీ పత్రమే దీనంతటికీ కారణమనే టాక్ నడుస్తోంది.
ముందస్తు చెల్లింపుల హామీ పత్రం (Letter Of Credit - LC) నిబంధన కరెంట్ కష్టాలకు కారణం కానుందనే నేపథ్యంలో తెలంగాణ చీకటిమయంగా మారబోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో ఆర్థిక చేయూత కోసం.. రుణాల గ్యారంటీ కోసం స్టేట్ గవర్నమెంటును డిస్కమ్లు పదేపదే కోరుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్ కష్టాలు తప్పవేమో అనే రీతిలో సమస్య జఠిలంగా మారనుందనే వాదనలు లేకపోలేదు.
కరెంట్ సంక్షోభం తప్పదా..!
తెలంగాణలో కరెంట్ సంక్షోభం ముంచుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు దాటితే రాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడనుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సిట్యువేషన్కు కేంద్ర ప్రభుత్వ నిబంధనలే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని విద్యుత్తు సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేయాలంటే కొత్త రూల్స్ ఫాలో కావాల్సి ఉంది. ఆ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి ముందస్తు చెల్లింపుల హామీ పత్రం (Letter Of Credit - LC) సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఎల్సీ సమర్పించడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
అదలావుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధన డిస్కమ్లకు సరికాదనేది దక్షిణాది రాష్ట్రాల విద్యుత్తు కమిటీ కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఆ లేఖను చెత్తబుట్ట దాఖలు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. పవర్ ప్రొడక్షన్ చేస్తున్న వివిధ సంస్థల నుంచి నెలనెలా డిస్కమ్లు కరెంటును కొంటున్నాయి. ఆ క్రమంలో పొరుగున ఉండే ఆయా విద్యుత్ సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేయాలంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ సబ్మిట్ చేయాలనడం ఆందోళన కలిగించే పరిణామంలా కనిపిస్తోంది.
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని సేఫ్.. కిడ్నాప్ జరిగిందా.. డ్రామానా?
ఇటు పెండింగ్ బకాయిలు.. అటు ఎల్సీ.. డిస్కమ్లకు కష్టమేనా..!
లెటర్ ఆఫ్ క్రెడిట్ డిస్కమ్లకు ఇబ్బందికరంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయా విద్యుత్ సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేస్తున్న డిస్కమ్లు వాటికి బాకీ పడుతున్నాయి. ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనుక్కుని తమ వినియోగదారులకు అమ్ముకుని డబ్బులు వచ్చాకా వాటికి చెల్లిస్తున్నాయి డిస్కమ్లు.
ఈ పద్దతిలో ఇప్పటివరకు ఆయా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 12 వేల కోట్ల రూపాయల దాకా డిస్కమ్లు బాకీ పడ్డాయట. వాస్తవానికి ప్రభుత్వ సంస్థలే 8 వేల 920 కోట్ల రూపాయల మేర డిస్కమ్లకు బాకీ పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. ఆ గవర్నమెంట్ సంస్థలు పెండింగులో పెట్టిన కరెంటు బిల్లులు చెల్లిస్తే సగం బాధల నుంచి డిస్కమ్లు గట్టెక్కినట్లే. కానీ సదరు సంస్థలు కరెంటు బిల్లులు చెల్లించక డిస్కమ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
నిబంధన తెచ్చిన తంటా.. ఇలా ఐతే చీకట్లే..!
లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధన కారణంగా తెలంగాణకు విద్యుత్ అమ్ముతున్న ఛత్తీస్గఢ్, సెమ్కార్బ్, ఎన్టీపీసీ సంస్థలు నిరాకరించే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఆ సంస్థల నుంచి కరెంటు సరఫరా నిలిచిపోనుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ రూల్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు డిస్కమ్లు లేఖ రాశాయి. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. తొలిదశలో 1100 కోట్లు ఇవ్వాలని కోరినా.. మలిదఫాలో లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం పూచీకత్తు ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం స్పందించలేదట.
కనీసం 5వేల కోట్ల రుణం తీసుకునేందుకు పూచీకత్తు ఇవ్వాలని అడిగినా సర్కార్ సరిగా రెస్పాండ్ కాలేదనే వాదనలున్నాయి. అంతేకాదు 1000 కోట్ల రూపాయలైనా ఇవ్వాలని పదేపదే అడుగుతున్నా.. ప్రభుత్వం స్పందించలేని పరిస్థితులో ఉందట. అదలావుంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో 8 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉందనేది ఒక అంచనా. అయితే లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధన గడువు ఆగస్టు ఒకటో తేదీ నాటికి ముగుస్తుండటంతో డిస్కమ్లకు తలనొప్పిలా మారనుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్పై పునఃసమీక్ష జరిపి నిబంధనలు సడలిస్తే ఓకే.. లేదంటే రాష్ట్రంలో చీకటి కష్టాలు మొదలుకానున్నాయనే ప్రచారం జరుగుతోంది.