దర్శకుడు ఆర్జీవీ ఆఫీసుపై దాడి.. జనసేన కార్యకర్తలేనని ఫిర్యాదు.. ‘పవర్ స్టార్’ వివాదంలో ట్విస్ట్..
కొద్ది రోజులుగా తెలుగునాట సంచలనంగా మారిన 'పవర్ స్టార్' సినిమాపై వివాదంలో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆఫీసుపై బుధవారం దాడి జరిగింది. జూబ్లీహిల్స్ లోని తన ఆఫీసుపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలుగా భావిస్తోన్న కొందరు ఆర్జీవీ ఆఫీసులో గలాటాకు దిగగా, అక్కడి గార్డులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో విధ్వంసం తప్పినట్లయింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రావడం, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తూ ఆర్జీవీ ''పవర్ స్టార్'' పేరుతో ఫిక్షన్ సినిమాను రూపొందించడం, ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేయడం తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్ కు వ్యతిరేకంగా ఈ దాడి జరిగినట్లుందని దర్శకుడు తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
కాగా, తన ఆఫీసుపై పవన్ ఫ్యాన్స్ దాడి చేయడం వల్ల 'పవర్ స్టార్' సినిమాకు అదనపు పబ్లిసిటీ లభించినట్లయిందని, అందుకోసం దాడి చేసిన అందరికీ ముద్దులు, ప్రేమలు పంచాలనుకుంటున్నట్లు ఆర్టీజీ ట్వీట్ చేశారు. ''జనసేన కార్యకర్తలుగా చెప్పుకున్న పవన్ ఫ్యాన్స్ కొదరు నా ఆఫీసుపై దాడికి దిగారు. అయితే, పోలీసులు గార్డులు వాళ్లను పట్టుకుని కటకటాల్లోకి నెట్టేశారు. దీంతో నా సినిమాకు పబ్లిసిటీ దొరికింది''అని వర్మ పేర్కొన్నారు.
ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించిన రాంగోపాల్ వర్గ శ్రేయాస్ మీడియాతో కలిసి ఏటీటీ ద్వారా తన సినిమాలను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, విడుదలకు ముందే పవర్ స్టార్ సినిమా ట్రైలర్ లీక్ కావడం వివాదాస్పదమైంది. కొందరు పవర్ ఫుల్ వ్యక్తులు తన సైట్ పై దాడికి కుట్రలు పన్నారని దర్శకుడు ఆరోపించారు.