ప్రగతిభవన్ వద్ద పద్మా దేవేందర్రెడ్డికి అవమానం..!! లోనికి వెళ్లేందుకు అనుమతించని సెక్యూరిటీ ...
హైదరాబాద్ : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి ప్రగతి భవన్లో అవమానం జరిగింది. ఇవాళ గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు ఉన్నందున ప్రగతి భవన్లోకి వెళ్లేందుకు ఆమె వచ్చారు. అయితే ఆమెకు అనుమతి లేదని పోలీసులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక పద్మా దేవేందర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఓ మాజీ డిప్యూటీ స్పీకర్ను సీఎం అధికార నివాసంలోకి వెళ్లనీయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది.
కశ్మీర్లో మరోసారి తెగబడ్డ ముష్కరులు.. సోపోర్లో కాల్పులు.. చిన్నారి సహా నలుగురికి గాయాలు
తెలుగురాష్ట్రాల గవర్నర్గా సుదీర్ఘకాలం పనిచేశారు నరసింహన్. దాదాపు తొమ్మిదేళ్లు సేవలందించారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో నరసింహన్కు తెలంగాణ ప్రభుత్వం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లకు మాత్రమే ఆహ్వానం అందజేశారు. మిగతా వారికి ఆహ్వానించలేదు. అయితే కొందరు ప్రగతి భవన్కు వచ్చి .. అనుమతి లేదని వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి పనిచేశారు. కేసీఆర్ 2.0 ప్రభుత్వంలో మాత్రం ఆమెకు చోటు లభించలేదు. దీంతో ఎమ్మెల్యేగానే ఉన్నారు. గవర్నర్ నరసింహన్ వీడ్కోలు విషయం తెలుసుకొని .. ప్రగతి భవన్ బయల్దేరారు. అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆమెను అడ్డుకున్నారు. వీడ్కోలు సభకు మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు మాత్రమే ఆహ్వానం ఉందని చెప్పారు. తనకు ఇన్విటేషన్ లేకపోవడంతో ... పద్మా దేవేందర్ రెడ్డి ఏం చేయలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.