కరోనా ఎఫెక్ట్: మేడారం జాతరలో హైఅలర్ట్.. పుకార్లు నమ్మొద్దు.. మంత్రి ఈటల
శ్వాస పీల్చడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదకర కరోనా వైరస్ ఇప్పుడు మనను కూడా భయపెడుతోంది. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారన్న వార్త దావానలంలా వ్యాపించింది. అయితే టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న స్థాయిలో వైరస్ ప్రభావం లేదని, తెలంగాణలో ఇప్పటిదాకా కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదుకాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
ఐసోలేషన్ వార్డులు సిద్ధం..
కరోనా వైరస్ భయాల నేపథ్యంలో మంత్రి ఈటల బుధవారం హైదరాబాద్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చైనా నుంచి వచ్చిన వారిలో అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి.. వాళ్ల రక్తనమూనాలను టెస్టుల కోసం పుణెకు పంపామని, ఇప్పటివరకైతే వైరస్ నిర్ధారణ కాలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ లో 100 పడకలతో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశామని, గాంధీ, ఫీవర్, ఛెస్ట్ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేశామని వివరించారు.
వైరస్ ను గుర్తించడమే పెద్ద సవాలు..
కరోనా వైరస్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, కరోనాలో డెండ్యూ లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి.. జ్వరం చేసినవాళ్లు కూడా భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. కరోనాకు సంబంధించి వైరస్ ను గుర్తించడమే పెద్ద సవాలని, శాంపిల్స్ ను పుణెకు పంపకుండా.. హైదరాబాద్ లోనూ టెస్టులు నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఈటల చెప్పారు.
మేడారంలో హైఅలర్ట్
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం.. మేడారం జాతర ఇప్పటికే ప్రారంభమైన సమయంలోనే కరోనా భయాలు వ్యాపించిన నేపథ్యంలో జాతర జరిగే ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించామని మంత్రి తెలిపారు. ఆరుగురు జిల్లావైద్యాధికారులు, 13 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామన్నారు. మేడారం జాతరకు ఈ ఏడాది కూడా కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా.
పుకార్లు ప్రసారం చేయకండి..
కరోనా వైరస్ పై సోషల్ మీడియాతోపాటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అధికారులతో మాట్లాడి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే దీనికి సంబంధించిన వార్తలు రాస్తే మంచిదని మంత్రి ఈటల సూచించారు. ఎండలు పెరుడుతున్న క్రమంలో వైరస్ విస్తరించే అవకాశంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 131 మంది చనిపోయారు.