ఓల్డ్ మలక్ పేట గుర్తులు ఎలా మారాయంటే, ఎస్ఈసీ పార్థసారథి వివరణ, ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
ఓల్డ్ మలక్ పేటలో గుర్తుల తప్పులపై ఎస్ఈసీ పార్థసారథి స్పందించారు. ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి విచారణ రిపోర్టు అందవలసి ఉందన్నారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ వెల్లడించారు. గుర్తుల తారుమారుకు సంబంధించి ప్రింటింగ్ ప్రెస్లో తప్పు జరిగిందని ప్రాథమికంగా తేలింది. బాధ్యతలపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. బంజారాహిల్స్లో పార్థసారధి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు.. ఓటింగ్ అంటే మాత్రం అనాసక్తి.. టెకీల నయా పోకడ..
ప్రశాంతంగా పోలింగ్..
గ్రేటర్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వే టీమ్ చురుగ్గా పని ప్రారంభించాయని చెప్పారు. శాంతిభద్రతల సమస్య వస్తే 105 స్ట్రైకింగ్ ఫోర్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. 56 స్పెషల్ స్ట్రైకింగ్ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని పార్థసారధి కోరారు.
ఎగ్జిట్ పోల్స్పై నిషేధం..
మరోవైపు గ్రేటర్ పోల్స్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిషేధం విధించారు. 3వ తేదీన రీ పోలింగ్ ఉన్నందున నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించొద్దని ఎస్ఈసీ పార్థసారథి ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను ధిక్కరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
3వ తేదీన రీ పోలింగ్
ఓల్డ్ మలక్ పేట డివిజన్ 69 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేశారు. బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి ఎదురుగా సీపీఎం గుర్తును ముద్రించారు. బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి రావడంతో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎన్నికను నిలిపివేస్తున్నామని ఎస్ఈసీ స్పష్టంచేసింది. 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది.
Recommended Video