"అమ్మ" కు ఆస్తి వేధింపులు.. కోర్టు సంచలన తీర్పు..!
హైదరాబాద్ : ఆస్తుల కోసం బంధాలు కనుమరుగవుతున్నాయి. కన్నోళ్లను వేధించే కలికాలం వచ్చింది. ఆస్తుల ముందర పేగుబంధం కూడా పలచనైపోతున్న కాలమిది. డబ్బు వ్యామోహంలో పడి తల్లిదండ్రులను పట్టించుకోని దౌర్భాగ్యస్థితి నెలకొంది. కని పెంచిన అమ్మనాన్నలు కాదని మనీ వెంట పరుగులు పెడుతున్నారు కొందరు. ఆ క్రమంలో తల్లిని విస్మరించిన ఓ కొడుకుతో పాటు అతని భార్యకు జైలుశిక్ష పడింది.
Recommended Video
తీర్పు సంచలనం.. అమ్మకు న్యాయం
మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిని వేధిస్తున్న కసాయి కొడుకుతో పాటు అతడి భార్యకు జైలుశిక్ష ఖరారు చేసింది. తండ్రి చనిపోయిన తర్వాత తల్లికి నరకం చూపించిన కొడుకుపై 2015లో కేసు నమోదైంది. ఆ మేరకు సోమవారం (22.07.2019) నాడు న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది. కోడలితో కలిసి కన్నకొడుకు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న మల్కాజిగిరి కోర్టు వారిద్దరికీ రెండు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
బిగ్బాస్ కోసం ఎంతకైనా తెగిస్తారా.. కింగ్పై వీహెచ్ ఫైరయ్యారుగా..!
కన్నతల్లికి నరకయాతన.. ఊచలు లెక్కించనున్న కొడుకు, కోడలు
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసముంటున్న 70 ఏళ్ల వృద్ధురాలు ప్రేమకుమారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2013లో భర్త కాలం చెందారు. ఆ పెద్దాయన ఉన్నప్పుడే పిల్లలందరికీ వివాహాలు జరిపించారు. ఎవరికివారుగా విడివిడిగా కాపురాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఇంటి పెద్దాయన కాలం చెందిన నాటి నుంచి ఆ తల్లికి పెద్ద కొడుకు నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్త పోయిన తర్వాత ఆ వృద్ధురాలికి అండగా నిలవాల్సిన పెద్ద కొడుకు ఆమె పాలిట శాపమయ్యాడు.
ముషీరాబాద్ ప్రాంతంలో విడిగా కాపురముంటున్న ప్రేమ కుమారి పెద్ద కొడుకు అమిత్ కుమార్, ఆయన భార్య షోబిత ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆ పెద్దావిడ ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆమెను బయటకు పంపేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నారనే ఇంగీత జ్ఞానం లేకుండా టార్చర్ పెట్టారు. దాంతో విసిగి వేసారిపోయిన ఆ తల్లి 2015లో నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
2015లో కేసు.. నాలుగేళ్లుగా విచారణ
ప్రేమ కుమారిని వృద్దాప్యంలో కొడుకు, కోడలు వేధించిన కేసుకు సంబంధించిన విచారణ దాదాపు నాలుగేళ్లుగా సాగింది. ఆ క్రమంలో సోమవారం (22.07.2019) నాడు తుది తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. ఆమెను వేధించిన పెద్దకొడుకు అమిత్ కుమార్తో పాటు కొడలు షోబితకు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అంతేకాదు ఇద్దరికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.
కేవలం ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బందులు పెట్టిన కొడుక్కి తగినశాస్తి జరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జన్మనిచ్చిన దగ్గర్నుంచి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే చివరకు పిల్లలు ఇలా మారిపోవడం సరికాదనే వాదనలు లేకపోలేదు. అహర్నిశలు పిల్లల బాగోగుల కోసం తపించే తల్లిదండ్రులను విస్మరిస్తే తస్మాత్ జాగ్రత్త అనేలా మల్కాజిగిరి కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని చెప్పొచ్చు.