కొడుక్కి జైలుశిక్ష.. దేవుడు న్యాయం చేశాడంటున్న అమ్మ (వీడియో)
హైదరాబాద్ : ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ఆ క్రమంలో కొడుకు ఎలాంటివాడైనా అమ్మ చూపించే ప్రేమ మారదు. మంచోడైనా, చెడ్డవాడైనా అమ్మ కరుణ మాత్రం కొడుకుపై ఉంటుంది. అయితే ఓ కొడుక్కి జైలుశిక్ష పడితే మాత్రం ఆ అమ్మ ఆనందిస్తోంది. నేరేడ్మెట్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చానీయాంశమైంది.
కొడుకును జైలుకు పంపిన అమ్మ
కొడుకును అమ్మే జైలుకు పంపిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. నేరేడ్మెట్లో ఉండే అమృత్ రావు, ప్రేమకుమారి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. అయితే అమృత్ రావు 2013లో కాలం చేశారు. ఆయన చనిపోగానే పెద్దకొడుకు అమిత్ కుమార్ తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. ఆస్తి కోసం ఆమెకు నరకయాతన చూపించాడు. ప్రతినిత్యం గొడవపడేవాడు. అందుకే ఆమె 2015లో కొడుకు వేధింపులు భరించలేక 2015లో కేసు పెట్టారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత మల్కాజిగిరి న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ప్రేమకుమారి పెద్దకొడుకు అమిత్తో పాటు ఆమె కోడలు షోబిత లావణ్యకు రెండేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది.
కోర్టు తీర్పుపై అమ్మ హర్షం.. ఎంత వేధించాడో మరి..!
కోర్టు తీర్పుపై ఆ అమ్మ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా దేవుడు చూశాడని.. తనకు తగిన న్యాయం చేశాడని అంటోంది. కొడుక్కి జైలుశిక్ష పడిందన్న బాధ ఆమెలో కనిపించడం లేదంటే ఆ కొడుకు ఆమెను ఎంత బాధపెట్టి ఉంటాడో మరి. కోర్టు తీర్పు తర్వాత కొందరు మీడియా ప్రతినిధులు ఆమెను కలిసిన తరుణంలో ఆమె చెప్పిన విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
2013లో భర్త చనిపోగానే 2015లో తమ ఇల్లుకు సంబంధించి పట్టా ఇష్యూ చేస్తున్నామని అధికారులు వచ్చారు. అదే విషయం పెద్దకొడుకును పిలిచి చెప్పాను. దాంతో అన్నీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి అతడి భార్య పేరు మీద పట్టా చేయించుకున్నాడు. అది నాకు చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఎమ్మార్వో ఆఫీసు నుంచి ఎంక్వైరీకి వచ్చారు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేయడంతో ఆ వచ్చినామె నా శిష్యురాలని తెలిసింది. అలా ఆమె కాస్తా ఇంట్రస్ట్ తీసుకుని పట్టా మీ పెద్దకొడుకు మీద అయిందని చెప్పింది.
అప్పటినుంచి వేధింపులే.. అమ్మ అని కూడా చూడలేదు
దాంతో చిన్నకొడుకును పిలిచి విషయం వివరించాను. అలా ఎమ్మార్వోను కలిసి పరిస్థితి వివరించాము. పెద్దకొడుకు తన భార్య మీద చేయించుకున్న పట్టా క్యాన్సిల్ చేయమని కోరాము. ఆయన సరేనని మాట ఇచ్చారు. ఇక అప్పటినుంచి పెద్దకొడుకు వేధించడం మొదలుపెట్టాడు. కరెంట్ బిల్లు కూడా వారి పేరు మీదే చేయించుకున్నారు. అంతేకాదు ఇది నా ఇల్లు, వెళ్లిపోవాలంటూ చాలాసార్లు బెదిరించాడు. పెద్దగా కేకలు వేసేవాడు. తన గురించి పట్టించుకోకుండా కేవలం ఆస్తి కోసం కొట్లాడేవాడు. ఇలాంటి సిట్యువేషన్ ఏ తల్లిదండ్రులకు రావొద్దని కోరుకుంటున్నా. ఏదిఏమైనా చివరకు దేవుడు నాకు న్యాయం చేశాడు. అందుకే కోర్టులో కేసు గెలిచాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రేమకుమారి.