కరోనా వైద్యం... కార్పోరేట్ దోపిడీకి తెలంగాణ సర్కార్ చెక్... ప్రజలు మెచ్చే కీలక నిర్ణయం...
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధీనంలోని వైద్య సౌకర్యాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కార్పోరేట్ ఆస్పత్రుల్లో సైతం 50శాతం పడకలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం(అగస్టు 13) ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.ఇందుకు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా అంగీకరించడంతో శుక్రవారం(అగస్టు 14) దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయనున్నారు.
Recommended Video
ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు... మరో 82 మంది మృతి....
ఆ 50శాతం పడకలకు ఇక ప్రభుత్వమే రిఫర్...
ప్రతీ కార్పోరేట్ ఆస్పత్రిలో 50% పడకలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకు గాను ప్రైవేట్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ ఆధీనంలోకి రానున్న ఈ పడకలకు ప్రభుత్వ వైద్యాధికారులే పేషెంట్లను రిఫర్ చేస్తారని చెప్పారు. ఓ ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్య, ఆరోగ్య శాఖ రోగులను రిఫర్ చేసేందుకు ప్రైవేట్, కార్పొ రేట్ ఆస్పత్రులు అంగీకరించాయన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాల ఖరారుకు ప్రజారోగ్య సంచాలకుడు డా.శ్రీనివాసరావుతో శుక్రవారం కార్పోరేట్ ఆస్పత్రి యాజమాన్యాలు భేటీ కావాలని మంత్రి కోరారు.
సగం... అంటే ఎన్ని పడకలు...
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 118 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం 7,879 పడకలు కేటాయించారు. అందులో సగం అంటే 3,940 పడకలు ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. అంటే ఈ పడకల్లో పేషెంట్లను ప్రభుత్వమే రిఫర్ చేస్తుంది. 3,216 రెగ్యులర్ బెడ్స్లో 1,608 పడకలు ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. అలాగే 3,145 ఆక్సిజన్ పడకల్లో1,572 పడకలు,1,518 ఐసీయూ పడకల్లో 759 పడకలు ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. ప్రభుత్వం పేషెంట్లను రిఫర్ చేయనున్న ఈ పడకల్లో ప్రభుత్వ ధరల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తారు.
పలుమార్లు విజ్ఞప్తులు చేసినా....
కరోనా సంక్షోభ సమయంలో ప్రైవేట్,కార్పోరేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీన్ని వ్యాపార కోణంలో చూసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆగడాలకు తెరపడలేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పేషెంట్ల కుటుంబాలను నిలువు దోపిడీ చేస్తూ వచ్చాయి. ప్రభుత్వానికి పేషెంట్ల కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నిబంధనలు పాటించని ఆస్పత్రులకు కరోనా ట్రీట్మెంట్ లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేసింది.
అవేవీ ఫలితం ఇవ్వకపోవడంతో...
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు,చికిత్సకు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేట్,కార్పోరేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలు దోపిడీతో... ప్రతీ ఆస్పత్రిలోనూ ఆ చార్ట్ను అందరికీ కనిపించేలా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా అక్కడ ఉన్న ధరల ప్రకారమే ప్రజలు ఫీజులు చెల్లించడానికి ఆస్కారం ఉంటుందని ఆ ఆదేశాలిచ్చింది. అటు లైసెన్సులు రద్దు చేసినా.... ఫీజు చార్టులు ఏర్పాటు చేయాలని చెప్పినా... ఇవేవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. మరోవైపు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్,కార్పోరేట్ ఆస్పత్రుల్లో సగం పడకలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడం బెటర్ అని ప్రభుత్వం భావించింది.
విమర్శల నుంచి కితాబుల వరకు...
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ మొదటినుంచి వినిపిస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకుని కరోనాపై పోరుకు వాడాలని గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే టెస్టుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ వచ్చాయి. పొరుగు రాష్ట్రంలో భారీగా టెస్టులు చేస్తుంటే... ఇక్కడ మాత్రం టెస్టులను స్పీడప్ చేయట్లేదన్న విమర్శలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఈ విమర్శలకు సమాధానం చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. నిన్న మొన్నటిదాకా మొట్టికాయలు వేస్తూ వచ్చిన హైకోర్టు సైతం తాజాగా ప్రభుత్వ చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేసింది.