ప్రాజెక్టుల కిరికిరి.. ఇటు వీళ్లు, అటు వాళ్లు.. ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారమేనా?
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లోనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందంటూ ఫైరవుతున్నారు. అదే క్రమంలో క్షేత్ర స్థాయిలో తమకు న్యాయం చేయాలంటూ ముంపు నిర్వాసితులు రోడ్డెక్కుతున్నారు. మొత్తానికి ఇటు విపక్ష నేతల ఆగ్రహం.. అటు నిర్వాసితుల గోడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కొన్ని చోట్ల పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలనే ఆందోళనలు కూడా మిన్నంటుతున్నాయి.
కేసీఆర్ ఇలాకాలో నిర్వాసితుల గొడవ
ఉమ్మడి మెదక్ జిల్లా హుస్నాబాద్ పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఆ క్రమంలో అక్కన్నపేట మండలంలోని గూడాటిపల్లి దగ్గర నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు అడ్డుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించాలని కోరారు. దాంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోయామని.. ఇంతవరకు పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.
కార్ల షోరూమ్ ఓనర్లుగా ఫోజులు.. బ్యాంకులకే టోకరా.. లక్షలు ముంచిన ఆ నలుగురు..!
సాగు, తాగునీటి సాధన కోసం కాంగ్రెస్ లీడర్ల పాదయాత్ర..!
రంగారెడ్డి జిల్లాలో సాగు, తాగునీటి సాధన కోసం కాంగ్రెస్ లీడర్లు పాదయాత్ర చేపట్టారు. పాత డిజైన్ ప్రకారమే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించాలని.. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి జిల్లాకు నీరందించాలని డిమాండ్ చేస్తూ జలసాధన మహాపాదయాత్రను తలపెట్టారు. శంకర్పల్లి మండలం మహాలింగాపురంలో మంగళవారాం నాడు ప్రారంభం కావాల్సిన పాదయాత్రను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని గృహనిర్బంధం చేశారు.
మిడ్ మానేరు నిర్వాసితుల నుంచి చొప్పదండి ఎమ్మెల్యేకు చెక్..!
మిడ్ మానేరు కిందకు వచ్చే బోయినపల్లి మండలంలోని మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సోమవారం నాడు స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు చేదు అనుభవం ఎదురైంది. ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లైంది. కుదురుపాక, నీలోజిపల్లి గ్రామాలకు చెందిన మిడ్ మానేరు ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వాహనం ముందుకెళ్లకుండా బైఠాయించారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
కశ్మీర్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. సీతారాం ఏచూరికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు
కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు మార్పు.. రేవంత్ రెడ్డి గరం
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని ఫైరయ్యారు. ఒకవేళ కమీషన్ల కోసం కక్కుర్తి పడకుంటే.. ప్రాజెక్టుల డీపీఆర్ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం నిర్మాణాత్మక పోరాటం చేస్తామన్నారు. ప్రాజెక్టుల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు సాధన కోసం కోమటిరెడ్డి పోరాటం..!
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన కోసం కాంగ్రెస్ మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి పాలకుల కళ్లు తెరిపించాలనేది ఆయన ఉద్దేశం. అయితే అనుమతి లేదంటూ పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. అయితే ఆరు నూరైనా ప్రాజెక్టు సాధన కోసం కృషి చేస్తానని సవాల్ విసిరారు కోమటిరెడ్డి. హైకోర్టును ఆశ్రయించి పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు.
మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సెగ తగిలేలా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేది కాంగ్రెస్ నేతల మనోగతంగా స్పష్టమవుతోంది. అయితే పోలీసుల రూపంలో వారికి అడ్డు తగులుతుండటంతో చివరకు ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.