మణిపూర్ యువకులపై జాత్యహంకారం: కేటీఆర్ ఆగ్రహం, సూపర్మార్కెట్పై కేసు
హైదరాబాద్: వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్లోకి విదేశీయులనే అనుమానంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను అనుమతించని ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీని కోరడంతో సదరు సూపర్ మార్కెట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు.
జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మణిపూర్ యువకులు వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్కు వెళ్లారు. అయితే, వారిని చైనీయులుగా భావించిన సూపర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డులు లోపలికి అనుమతించలేదు. తాము విదేశీయులం కాదని, తాము భారతీయులేమేనని చెప్పినా వినిపించుకోలేదు. తమ ఆధార్ కార్డులను కూడా చూపినా వారు అనుమతించలేదు.
తనకు హిందీ తెలియదని, తెలుగులో మాట్లాడాలని సెక్యూరిటీ గార్డు వారిని సూచించారు. తెలుగులో మాట్లాడితేనే తాను సమాధానమిస్తానని చెప్పారు. భారతీయులందరికీ తెలుగు ఎక్కడి నుంచి వస్తుందని ఆ మణిపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాగా, జరిగినదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు మణిపూర్ యువకులు. కేటీఆర్ దృష్టికి ఈ వీడియో రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.
This is absolutely ridiculous and unacceptable. Racism in any form should be dealt with sternly
— KTR (@KTRTRS) April 9, 2020
Request @TelanganaDGP Garu to instruct all Police Commissioners & Superintendents of Police to take up these issues seriously with retail association & send out a clear message https://t.co/A5WGxEyqbZ
ఇలాంటి దోరణిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. జాత్యహంకారం సహించవద్దని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వాలని తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలో వనస్థలిపురం పోలీసులు సదరు సూపర్ మార్కెట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని తేల్చిచెప్పారు. జాత్యహంకార చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
Give me the deatails of the location of this incident
— Kiren Rijiju (@KirenRijiju) April 8, 2020
ఇది ఇలావుంటే, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులకు ఎదురైన చేదు అనుభవంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలపాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు.