అంత ఘోరమా.. స్కూల్లో ర్యాగింగా.. 10వ తరగతిలోనే అరాచకమా?
హైదరాబాద్ : ర్యాగింగ్ భూతం కాలేజీల్లోనే కాదు స్కూళ్లకు కూడా పాకుతోంది. సీనియర్లమంటూ పైతరగతి విద్యార్థులు కింది తరగతుల స్టూడెంట్స్ను వేధించడం షరా మామూలైపోతోంది. ర్యాగింగ్ చేస్తే తాట తీస్తామంటూ పోలీసులు బెదిరించినా ఫలితం కనిపించడం లేదు. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఎక్కువగా కనిపించే ర్యాగింగ్ భూతం సెన్సిటివ్ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కాలేజీల నుంచి స్కూళ్ల దాకా.. వామ్మో ర్యాగింగ్ ..!
ఇంజనీరింగ్ లాంటి వృత్తివిద్యా కాలేజీల్లో కనిపించే ర్యాగింగ్ భూతం క్రమక్రమంగా స్కూళ్లకు పాకుతోంది. అమాయక విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. స్కూలింగ్ విద్యార్థుల్లో కనిపిస్తున్న ఈ పైశాచికం భయాందోళన కలిగిస్తోంది. పదో తరగతి విద్యార్థులు సైతం ర్యాగింగ్ భూతానికి అలవాటుపడుతుండటం కలవరం రేపే అంశం. తాజాగా హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఘటన విస్మయం కలిగిస్తోంది.
తోటి విద్యార్థులు ప్రతి నిత్యం వెకిలిచేష్టలతో వేధించారనే కారణంగా పదో తరగతి విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేయడం చర్చానీయాంశమైంది. ర్యాగింగ్ పేరిట తనను తీవ్రంగా వేధించారని నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడటం దుమారం రేపింది.
కౌన్సిలర్లుగా మేము సైతం.. యూత్ ఆశలు.. నేతలకు తిప్పలు
వెకిలి చేష్టలు.. వేధింపులు.. పదో తరగతి విద్యార్థికి నరకం
సరూర్ నగర్ పరిధిలోని లింగోజిగూడ ప్రాంతానికి చెందిన మాధవరావు కుమారుడు ప్రస్తుతం పదో తరగతి. కర్మాన్ఘాట్లోని నియో రాయల్ స్కూల్లో చదువుతున్నాడు. అయితే తోటి విద్యార్థులు ఇద్దరు తనను కొంతకాలంగా వేధిస్తున్నారట. ర్యాగింగ్ పేరిట అనరాని మాటలంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట. టాయిలెట్కు వెళ్లిన సందర్భంలోనూ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. బయట నుంచి తలుపు గొళ్లెం పెడుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారనేది బాధిత విద్యార్థి ఆరోపణ.
అదంతా తట్టుకోలేక వారిని నిలదీశాడు. దాంతో ర్యాగింగ్ వేధింపులు ఆగాలంటే 6 వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించారట. ఆ మేరకు కుటుంబ సభ్యులకు తెలియకుండా వారు అడిగిన డబ్బులు ఇచ్చేశాడట సదరు బాధితుడు. అక్కడితో ఆగకుండా దాడి కూడా చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసినట్లు నోట్ రాశాడు.
తోటి విద్యార్థులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. సారీ, మమ్మీ డాడీ..!
ఆరు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత ర్యాగింగ్ ఆపలేదని.. తనను వేధిస్తూనే ఉన్నారని వాపోయాడు. ఇటీవల మరో వెయ్యి రూపాయలు తేవాలంటూ ఆర్డరేశారట. ఆ క్రమంలో అడిగిన సొమ్ము ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావని టాయిలెట్కు వెళ్లే క్రమంలో అడ్డగించి చేయి చేసుకున్నారట. దాంతో వారి వేధింపులు తట్టుకోలేక అదే రోజు రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే రాత్రి సమయంలో గదిలో ఉన్న కుమారుడు ఇంకా భోజనానికి రావడం లేదంటూ పేరెంట్స్ చూడటంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు బయటపడింది.
వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే తమ కుమారుడిపై సహచర విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా ప్రవర్తించారని స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. దాంతో బాధిత విద్యార్థి తండ్రి సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ర్యాగింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.