తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ్పరివార్, కేసీఆర్పై ఎంతో నమ్మకం పెట్టుకుంటే: రేవంత్ ఇలాకాలో రాహుల్
కోస్గి: కేసీఆర్ పైన తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కానీ ఆ నమ్మకాన్ని ఆయన వమ్ముచేశారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో మండిపడ్డారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు కన్నకలలు నెరవేర్చని ఈ ప్రభుత్వం అవసరమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మీ ఆశలు సఫలం కావాలంటే మహాకూటమి విజయం సాధించాలని చెప్పారు. ప్రజలు ఆశించిన విధంగా కేసీఆర్ ప్రభుత్వం చేయలేకపోయిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఈ లెక్కన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు ఖర్చు పెట్టవచ్చునని చెప్పారు.
కేసీఆర్ను గద్దె దించాలి
కేసీఆర్ను గద్దె దించాలంటే ప్రజాకూటమిని గెలిపించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికి ఆదాయం బాగా పెరిగిందని, కానీ ప్రజలకు మాత్రం ఏమీ పెరగలేదని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని చెప్పారు. పాత ట్యాంకులకు రంగులు వేసి కొత్తగా చూపించాలన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి
ఈ రోజు తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని నిలదీశారు రాహుల్ గాంధీ. తెలంగాణ యువకులు, రైతులను కేసీఆర్ మోసం చేసారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఇది కేసీఆర్ సర్కార్ను దించే గాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టుకు అంచనాలు పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
తెలంగాణ ప్రజల నెత్తిపై అప్పు, కేటీఆర్ ఆదాయం నాలుగు రెట్లు
తెలంగాణ ప్రజలపై పెద్ద అప్పు ఉందని, కానీ కేటీఆర్ తలసరి ఆదాయం మాత్రం నాలుగు రెట్లు ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. నేడు తెలంగాణలోని ప్రతి వ్యక్తి పైన అప్పు ఎందుకు ఉందో చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఇది ధనిక రాష్ట్రమని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ కేసీఆర్ రెచ్చగొట్టి రాజకీయం చేస్తారన్నారు. దేశంలో మైనార్టీలు, ఆదివాసీల పట్ల మోడీ బేధభావం చూపిస్తున్నారని, దానికి కేసీఆర్ మద్దతు ఉందని ఆరోపించారు. మోడీ ఎప్పుడూ దేశాన్ని విభజించే పనిలో ఉంటారని చెప్పారు.
తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్
మహిళల భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి జరగదని రాహుల్ గాంధీవ చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆశ చూపించి కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. ఎన్నో లక్షలు ఇళ్లు కట్టిస్తామని చెప్పి కనీసం 5 లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ్పరివార్ అని ఆరోపించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని ఓడిస్తామని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, ఆ మూడు రాష్ట్రాలలో బీజేపీ, తెలంగాణలో తెరాసను ఓడిస్తామన్నారు.మజ్లిస్, తెరాసలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. భూసేకరణ చట్టం బిల్లులోనూ మోడీకి కేసీఆర్ మద్దతు పలికారని గుర్తు చేశారు. రాఫెల్ కుంభకోణం పైన ఏనాడైనా కేసీఆర్ మాట్లాడారా అని నిలదీశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఏనాడు కూడా మాట్లాడలేదని చెప్పారు.
కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు
తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రాలేదని, కానీ కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు అయిదేళ్ల క్రితం తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశించారని చెప్పారు. ప్రజలు ఆశించిన విధంగా ప్రభుత్వం పని చేయలేదన్నారు.