అడ్రస్ కూడా లేని నన్ను.., 40ఏళ్ల తర్వాత మళ్లీ: కాంగ్రెస్ గెలుపుపై రేవంత్ రెడ్డి సెంటిమెంట్
కోస్గి/మహబూబ్ నగర్: 1978లో నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఇందిరా గాంధీ కోస్గి వచ్చి ఎన్నికల ప్రచారం చేశారని, ఇప్పుడు నలభై ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కూడా రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
కోస్గిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ రాకతో తెలంగాణ పునీతమైందని చెప్పారు. తెలంగాణ జన సమితి అధినేత, ప్రజా ఫ్రంట్ చైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో కురుక్షేత్రం ప్రారంభమైందని చెప్పారు. రాహుల్ గాంధీ రాకతోనే మహాకూటమి విజయం ఖరారయిపోయిందని చెప్పారు. నాలుగేళ్లలో తనపై 39 కేసులు పెట్టారని ఆరోపించారు.
కేసీఆర్ను ఒక్కసారి గెలిపిస్తే వందల కోట్లు సంపాదించారు
కేసీఆర్ను ఒక్కసారి గెలిపిస్తే వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, తెలంగాణ సమాజానికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. కేసీఆర్ను మరోసారి గెలిపించవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమిని గెలిపించాలన్నారు. మన కొడంగల్ భూమిపై రాహుల్ గాంధీ అడుగు పెట్టారన్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
ఇప్పుడు రాహుల్ అడుగుతో అధికారంలోకి కాంగ్రెస్
40 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ కోస్గీ వచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరా గాంధీ అడుగుపెట్టగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 40 ఏళ్ల తర్వాత ప్రజాకూటమిని గెలిపించడానికి ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చారని చెప్పారు. అప్పుడు ఇందిరా గాంధీ రావడంతో సమైక్య ఏపీలో 175 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితం తనకు ఇక్కడ అడ్రస్ కూడా లేని సమయంలో బీఫాం తీసుకొని వచ్చి నామినేషన్ వేస్తే ఇక్కడి ప్రజలు తనను 7వేల మెజార్టీతో గెలిపించారని, దీనిని తాను ఎప్పుడూ మరిచిపోనని చెప్పారు.
కేసీఆర్ను బంగాళాఖాతంలో కలిపే వరకు పోరాటం చేస్తా
ఆ రోజు నుంచి తాను ప్రజాసేవలోనే ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. 2014లో తనను పదిహేను వేల మెజార్టీతో ఆశీర్వదించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా ప్రజాకూటమి ఏర్పడిందని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసే సమయం ఎంతో దూరం లేదన్నారు. తనపై కక్ష కట్టి కేసీఆర్, నాలుగేళ్ల వ్యవధిలో ఎన్నో కేసులు పెట్టారన్నారు. కేసీఆర్ను బంగాళాఖాతంలో కలిపేంత వరకు పోరాటం చేస్తానని చెప్పారు.
రేవంత్ రెడ్డి నిప్పులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి తెరాసపై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణలో విద్యుత్తు వెలుగులకు సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమని ఆయన చెబుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో రాష్ట్రానికి 53.89 శాతం వాటా దక్కేలా ఆమె చొరవ చూపడం, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించడం వల్లనే అది సాధ్యమైందని గుర్తు చేస్తున్నారు.