నాకు జస్టిస్ జరగాలి.. పొలిటికల్ రుబాబుతోనే ఎటాక్ చేశారు:పబ్ దాడిపై రాహుల్ సిప్లిగంజ్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో తన మీద జరిగిన దాడిపై బిగ్ బాస్ సీజన్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. రితేశ్ రెడ్డి అనే వ్యక్తి,అతని స్నేహితులు అకారణంగా తనను దూషించి దాడి చేశారని ఆరోపించారు. పబ్లో తన స్నేహితురాళ్లతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో.. అప్పుడే వాష్ రూమ్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు.. కావాలనే తనను నెట్టేసుకుంటూ వెళ్లారని చెప్పారు. తనను నెట్టేసిన వ్యక్తి చెయ్యిని పట్టుకోగానే తన చెంపపై కొట్టాడన్నారు. అతని పేరు రితేశ్ రెడ్డి అని తెలిసిందని.. గతంలోనూ అతను ఇలాగే పలు పబ్లలో ఇతరులపై దాడులు చేసినట్టుగా తెలిసిందన్నారు. దాడిపై గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు.
సైలెంట్గా ఉన్నా రెచ్చగొట్టి దాడి చేశారు..
తన చెంపపై కొట్టినప్పటికీ తాను కొద్దిసేపు సైలెంట్ గానే ఉన్నానని రాహుల్ చెప్పారు. తనకున్న ఇమేజ్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో వాళ్లతో గొడవ పెట్టుకోదలుచుకోలేదన్నారు. కానీ కొద్దిసేపటికే వాళ్లు మళ్లీ తనను,తన స్నేహితురాళ్లను తిట్టడం మొదలుపెట్టారని.. దాంతో తాను కూడా తిట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఇంతలోనే రితేశ్ రెడ్డి,అతని స్నేహితులు తనపై దాడికి దిగారన్నారు. బీర్ బాటిల్తో తనపై దాడి చేయడంతో తలకు స్వల్ప గాయమైందని.. అక్కడినుంచి ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్లానని చెప్పారు.
పొలిటికల్ రుబాబుతోనే..
రితేశ్ రెడ్డి అనే వ్యక్తి ఓ ఎమ్మెల్యే సోదరుడని తెలిసిందని.. పొలిటికల్ రుబాబును చూపించుకునేందుకే తనపై దాడి చేశారని ఆరోపించారు. రాజకీయ నేపథ్యం ఉంటే ఏమైనా చేయవచ్చునన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారని.. అదే ఉద్దేశంతో తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తనపై దాడిచేసినవారిలో రితేశ్తో సహా మొత్తం 10మంది వరకు ఉన్నారని చెప్పారు. తప్పు చేస్తే మనపై దాడి జరిగినప్పుడు పెద్దగా బాధ అనిపించదని.. కానీ అకారణంగా దాడి చేస్తే ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు.
జస్టిస్ జరగాలి.. రాజీ పడే ప్రసక్తే లేదు..
తనపై దాడి చేసినవాళ్లను ఇంతకుముందెప్పుడూ చూడలేదని రాహుల్ చెప్పారు. కేసు నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని.. కానీ తాను మాత్రం ఏ పొలిటికల్ సపోర్ట్ తీసుకోనని స్పష్టం చేశారు. తనకు జస్టిస్ జరగాలని.. తనపై దాడి చేసినవాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక దాడి వల్ల కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందా అన్న ప్రశ్నను రాహుల్ కొట్టిపడేశారు.
సుమోటో కేసు నమోదు..
బిగ్ బాస్ విజేతగా గెలిచిన తర్వాత సంతోషపడ్డ తన తల్లిదండ్రులు.. నిన్నటి దాడిని చూసి బాధపడుతున్నారని రాహుల్ అన్నారు. తాను ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నట్టుగా జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. ఇప్పటికే విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లిందని.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. రాహుల్ ఫిర్యాదు కంటే ముందే గచ్చిబౌలి స్టేషన్లో సుమోటో కేసు నమోదైంది. మొత్తం ఆరుగురిపై సెక్షన్ 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారందరిని స్టేషన్కు పిలిపించి విచారించనున్నారు. దర్యాప్తు తర్వాత అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.