కరోనా కలకలం: రైల్ నిలయం తాత్కాలిక మూసివేత, 30 మందికిపైగా కరోనా
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయంలో కరోనావైరస్ కలకలం రేపింది. సుమారు 30 మందికిపైగా ఉద్యోగులకు ఈ మహమ్మారి సోకింది. రైల్ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు 2500 మంది సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. వారిలో 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా: కొత్త కేసుల కంటే రికవరీనే ఎక్కువ, ఇది మంచివార్తే
ఈ నేపథ్యంలో రెండ్రోజులపాటు రైల్ నిలయం మూసివేసి, శానిటైజ్ చేయనున్నట్లు రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. తిరిగి బుధవారం కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వైరస్ సోకిన వారిలో చాలా మందిలో లక్షణాలు లేనట్లు తెలిపారు.
సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన వందలాది మంది ఉద్యోగులు ఈ కార్యాలయంలో పనిచేస్తున్నారు. కరోనా సోకిన ఉద్యోగులను హోంక్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా బాధితుల ఫోన్ నెంబర్లను వైద్యులకు ఇచ్చిన అధికారులు.. వారిని పర్యవేక్షించాలని కోరారు. మిగితా ఉద్యోగులను కూడా కరోనా పరీక్షలను చేసుకోవాలని సూచించారు.
ఇది ఇలావుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,58,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30,532 యాక్టివ్ కేసులున్నాయి. 1,27,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 974 మంది కరోనా బారినపడి మరణించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1417 కేసులు నమోదు కాగా, 2479 మంది కోలుకున్నారు. 13 మంది మరణించారు.