నగరంలో దండిగా పడుతున్న వర్షాలు..! బండి తో జర బద్రం..!
హైదరాబాద్ : నగరాన్ని చినుకు చిత్తడి చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రహ దారులు జలమయమవుతున్నాయి. వాహన దారులు నరకం చూస్తున్నారు. అసలే వర్షాకాలం. అధ్వానంగా నగర రోడ్లు. అడుగుకో గుంత, ఇవన్నీ వాహనాలకు ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు మొరాయిస్తాయి. వర్షాకాలంలో వాహనాలకు తరచూ ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి, ప్రయాణం సాఫీగా సాగిపోవడానికి కొన్ని జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు ఆటో మొబైల్ నిపుణులు. ప్రముఖ కార్ల కంపెనీలు తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా మాన్సూన్ చెకప్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 లక్షల వాహనాలు ఉండగా, ఇందులో అత్యధికంగా 40లక్షల వాహనాల వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. నగరంలో జరిగే అత్యధిక ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలవే అధికంగా ఉన్నాయి.
ఎక్కడ మాన్ హోల్ ఉంటుందో తెలియదు..! ద్విచక్రవాహన దారులు జాగ్రత్తగా నడపాలి..!!
ద్విచక్రవాహనదారులు ఇంజిన్లోని వర్షం నీరు వెళ్ల కుండా చూసుకోవాలి. బైకు నీటిలో నుంచి వెళ్తే రిపేర్ తప్పదు. ఇంజన్లో సమస్య వచ్చే అవకాశం ఉంది. సైలెన్సర్లోకి నీరు వెళ్తే ఇంజన్లోకి చేరి దానిపై ప్రభావం పడుతుంది. వెంటనే సమ స్య కనిపించదు. కానీ, రెండు మూడు రోజుల తరువాత ఇబ్బంది పెడుతుంది.పెట్రోల్ ట్యాంక్లోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. ట్యాంక్ లాక్ చేశాం కదా....కదా అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. కానీ భారీ వర్షం పడుతున్నప్పడు ఎక్కువ సేపులో వర్షంలో బయట ఉండడం వల్ల నీరు సన్నటి ధార లోపలకు వెళ్లే అవకాశముంది. కార్పెట్లో ఎక్కువ మొత్తంలో నీరు వెళ్తే వాల్స్ ద్వారా ఇంజన్లోకి చేరిపోతుంది. స్టార్ట్ కావడం చేయడం కష్టం.
కార్ల యజమానులకు సూచనలు..! సైలెన్సర్ మునిగితే ముప్పే..!!
వర్షాకాలంలో కార్ల యజమానులు పలు అంశాలను తనిఖీ చేసుకోవాలి. దూర ప్రయాణం, ఎక్కువ వేగంగా వెళ్లే వారు కారు టైర్లు స్కిడ్ కాకుండా చూసుకోవాలి. రోడ్డు గ్రిప్ ఉండాలి. టైర్లకు కొంత జీవిత కాలం ఉంటుంది. దానికన్నా ముందుగానే వాటిని మార్చుకోవాలి. కారు వైఫర్లు పనితీరు బాగుండాలి. అవి సరిగా పని చేయకపోతే ముందుకు వెళ్లలేం. బ్రేకుల పనితీరుతో పాటు లోపల ఏసీ పనిచేయాలి.లేదంటే బయట వర్షం కురిసినప్పుడు లోపల ఫాగ్ ఏర్పడుతుంది. ఇది పోవాలంటే ఏసీ ఉండాలి. లేదంటే అద్దాలు తెరవాలి. వర్షంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అద్దాలు తెరవడం కుదరదు. లైట్లు బాగా పని చేస్తుండాలి. రోడ్ల పరిస్థితిని బట్టి కార్ల వేగం ఉండాలి. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో వేగంగా వెళితే కార్ల విడి భాగాలపై ప్రభావం చూపుతుంది.
కంకర తేలుతున్న రోడ్లు..! టైర్లు చెక్ చేసుకోక పోతే తొయ్యాల్సిందే..!!
వర్షాకాలంలో ఆథరైజ్డ్ క్యాంపుల్లో కార్లను తనిఖీ చేయించడం మంచిది. సీజన్లో బండి బయటకు తీసే ముందే టైర్లను పరీక్షించాలి. దీనివల్ల దుర్ఘటనలను నివారించుకోవచ్చు. ఎగుడు దిగుడుగా అరిగి ఉండటం, అసలు గ్రిప్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. 'యూజర్ మాన్యువల్' లో సూచించిన విధంగా టైర్ ప్రెజర్ ఉండడం శ్రేయస్కరం. రెగ్యులర్గా ఎలైన్ చేయించడం వల్ల టైర్ల మన్నిక కూడా పెరుగుతుంది. వర్షాలకు కారులోపలికి నీరు వెళ్తాయి. ఇలాంటి సమయంలోరబ్బర్ మ్యాట్స్కు బదులు ఫ్యాబ్రిక్స్ మ్యాట్స్ వినియోగించడం మంచిది.
ట్రాఫిక్ లో వాహనం నిలిస్తే నరకమే..! ముందుకు వెళ్లలేం.. పక్కకు తీయలేం..!!
నీరు నిలిచే ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లాలి. బ్రేకు, క్లచ్, గేర్లు జామ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. బైక్ను రోడ్డుపై పార్కింగ్ చేసే వారు వర్షపు నీరు పడకుండా మిడిల్ స్టాండ్ వేయాలి. ఎప్పటికప్పుడు వాహనాలకు ఇంజిన్ఆయిల్, బ్రేకులు, టైర్లు పరిశీలిస్తుండాలి. సైలెన్సెర్పై పడే బురద మరకలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆయిల్ మార్చుకోవాలి. టైర్లు స్కిడ్ కాకుండా చూసుకోవాలి.