హైదరాబాద్ ప్రజలకు ఊరట కలిగించే వార్త: రేపట్నుంచి వర్షాలు తగ్గుముఖం
హైదరాబాద్: గత వారం పది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ ఊపిరిపీల్చుకునే వార్తను తెచ్చింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. దీంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
అయితే, గురువారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఇక ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన సూచించారు. వాతావరణ శాఖ సూచనతో నగర ప్రజలకు కొంత ఊపిరిపీల్చుకునే అవకాశం లభించినట్లయింది.
కాగా, 1908 తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంత భారీ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. సుమారు 70 మంది ప్రజలు వరదల కారణంగా మృతి చెందారు. 37వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరద బాధితుల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు అందజేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
Recommended Video
ఇది ఇలావుంటే, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా ఇది కదులుతూ పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ తీరం వైపునకు వెళ్లే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంత ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలలో మోస్తారు నుంచి విస్తారంగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.