నడిరోడ్డుపై నిలిచిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం..
అప్పుడప్పుడు నేతలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. అవును రక్షణ అవసరం ఉండే నేతలు ఒక్కసారిగా రహదారిపై నిలచిపోతారు. అలా బుధవారం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎదరయ్యింది. రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది. దీంతో మరో వాహనం తెప్పించుకుని హైదరాబాద్ బయలుదేరారు.

ఉగ్రవాదుల నుంచి ముప్పు
ఎమ్మెల్యే రాజాసింగ్కు ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చింది. ఆయనకు ఉన్న ముప్పు ఉన్న దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. తరచూ వాహనం చెడిపోతుందని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండటం లేదని రాజాసింగ్ అన్నారు.

బాబు కాలం నాటి వాహనం
తనకు ఎప్పుడో చంద్రబాబు కాలం నాటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తవి కొన్నప్పటికీ వాటిని ఆ పార్టీకి చెందిన మంత్రులకు, వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులకే కేటాయించారని ఆరోపించారు. తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలుసన్నారు. ఆ దేవుడు, తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నవాళ్లకు ఇలాంటి పాత వాహనాలు ఇవ్వడం సరైంది ఏ మాత్రం కాదు. ఏదైనా జరగరానిది
జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.

మరో వాహనంలో రాజా సింగ్
రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్. హిందూ అనుకూలంగా కామెంట్స్ చేస్తుంటారు. హిందూ అతివాది.. దీంతో ఉగ్రవాద సంస్థల నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది. అయితే ఆయన వాహనం ఆగిపోవడం కలకలం రేపుతుంది. తనకు పాత వాహనం ఇచ్చారని ఆయన అంటున్నారు. వెంటనే మరో వాహనం తెప్పించుకుని వెళ్లిపోయారు.. కీలకమైన నేతలు రహదారిపై ఎక్కువ సమయం ఉండటం అంతా మంచిది కాదు.