బస్తీ మే సవాల్: మరోసారి తొడగొట్టిన రాజా సింగ్.. సైబరాబాద్ సీపీకి ఛాలెంజ్..
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తొడగొట్టారు. గోవుల అక్రమ రవాణాపై గాండ్రిల్లారు. రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరు పట్టుకుంటారా లేదా అంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు చాలెంజ్ చేశారు. ఇదే విషయంపై గత కొంతకాలంగా ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం కూడా సవాల్ విసిరారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరిక జారీ చేశారు. బహుదూర్పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్న వీడియోలను రాజాసింగ్ చూపించారు.
పోలీసులకు చేత కాకుంటే అనే పదాన్ని ఉపయోగించవచ్చని... కానీ అలా చేయనని అన్నారు. పోలీస్ కమిషనర్పై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదని కోరారు. అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజసింగ్ డిమాండ్ చేశారు.